సమంత ఐటెమ్ సాంగ్ తేలిపోయింది..!

అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ”పుష్ప: ది రైజ్” సినిమాలో సమంత రూత్ ప్రభు స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సామ్.. తన కెరీర్ లోనే తొలిసారిగా ఐటెమ్ సాంగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే ఈ పాటకు ఎలాంటి స్పందన వస్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తుండగా.. ఆ రోజు రానే వచ్చింది.

”పుష్ప” పార్ట్-1 తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో ఈ రోజు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పుష్పరాజ్ గా ఊర మాస్ అవతారంలో బన్నీ అదరగొట్టేసాడరని అభిమానులు అంటున్నారు. అయితే సమంత ఆడిపాడిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ మాత్రం తెలిపోయిందనే కామెంట్స్ ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి.

నిజానికి ‘ఊ అంటావా’ పాట లిరికల్ వీడియో విడుదల చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెర వైరల్ అయింది. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్ కు ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ తోడై ట్రెండింగ్ లో నిలిచింది. లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని కేసు కూడా పెట్టినట్లు ప్రచారం జరిగింది. నెట్టింట ఇంత హడావుడి చేసిన ఈ పాటపై వెండితెర మీద చూసిన ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు.

ఊ అంటావా ఊఊ అంటావా అని సమంత ఎంత ఊపినా.. ఆమె ఫేస్ లో ఒకప్పటి గ్లో మిస్ అవడంతో ఆశించిన స్థాయిలో పాట లేదని సినీ అభిమానులు అంటున్నారు. ‘రంగస్థలంలో’ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ తో కంపేర్ చేస్తే.. సామ్ సాంగ్ నిరాశ పరిచినట్లే అని చెబుతున్నారు. అంతేకాదు ముగ్గురు కొరియోగ్రాఫర్స్ కలిసి కంపోజ్ చేసిన ఈ ప్రత్యేక గీతంలో డ్యాన్స్ అస్సలు బాగాలేదని కామెంట్స్ వస్తున్నాయి.

డైరెక్టర్ సుకుమార్ తన ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్స్ తో మ్యాజిక్ చేశారు. ‘అ అంటే అమలాపురం’ – ’36 24 36′ ‘రింగ రింగా’ ‘డియాలో డియాలా’ ‘లండన్ బాబూ’ ‘జిల్ జిల్ జిగేలు రాణి’ పాటలను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ ”పుష్ప” సినిమాలో సమంత తో కలసి ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. దీనిని బట్టి మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ని ఊపేసిన సమంత ‘ఊ అంటావా’ లిరికల్ పాట.. థియేటర్లలో మాత్రం అనుకున్న స్థాయిలో షేక్ చేయడం లేదని తెలుస్తోంది.