తెలుగు చలనచిత్ర పరిశ్రమను అనాథను చేస్తూ.. దర్శకరత్న దాసరి నారాయణ రావు వెళ్లిపోయారు. చిన్న సినిమాలకు అండగా నిలుస్తూ.. చిత్రపరిశ్రమలోని 24 క్రాఫ్ట్ లలో ఎక్కడ ఎలాంటి వివాదం జరిగినా.. దాన్ని పరిష్కరించుకునే బాధ్యతను నెత్తిన వేసుకునే ఆయన.. తన తర్వాత తనలాంటి వారసుడ్ని చిత్రపరిశ్రమకు ఇవ్వకుండానే వెళ్లిపోయారని చెప్పాలి.
దాసరి మరణంతో షాక్ తిన్న చిత్ర పరిశ్రమ ఒక్కసారి అవాక్కైంది. తల్లి..తండ్రిని ఒకేసారి పోగొట్టుకుంటే ఎంత బాధతో విలవిలలాడిపోతారో.. టాలీవుడ్ తాజా పరిస్థితి ఇంచుమించు ఇదేలా ఉంది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అంతా దాసరి మరణంతో విలవిలలాడిపోతున్నారు.
తమను దిక్కు లేనివారిగా చేసి వెళ్లిపోయారంటూ వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. దాసరి ఇంట చోటు చేసుకునే మరణాల్లో కొత్త కోణం ఒకటి కనిపిస్తుంది. దాసరి నారాయణరావు ఇంట్లో.. ఆయన సతీమణి కొంతకాలం కిందట కాలం చేశారు. ఆమె పుట్టిన నెలలోనే మరణించారు. అదే రీతిలో తాజాగా దాసరి విషయంలోనూ అలాంటిదే కనిపిస్తుండటం గమనార్హం.
1946 అక్టోబరు 25న దాసరి పద్మ సత్తుపల్లిలో జన్మిస్తే.. 2011 అక్టోబరు 28న మరణించారు. ఇక.. దాసరి నారాయణరావు విషయానికి వస్తే ఆయన 1942 మే 4న పాలకొల్లులో జన్మిస్తే.. 2017 మే 30న హైదరాబాద్ లో కన్నుమూశారు. ఇలా.. దాసరి నారాయణరావు.. ఆయన సతీమణి ఇద్దరూ పుట్టిన నెలలోనే మరణించటం అరుదైన యాదృచ్ఛిక ఘటన.