రెడ్డిగారు ఇచ్చిన లంచం.. 400 కోట్లు

పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా కరెన్సీతో చిక్కిన తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే నేత శేఖరరెడ్డి గుర్తుండే ఉంటారు. తమిళనాడులో ఇసుక మాఫియా రారాజుగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులను ఎదుర్కొంటున్న ఆయన అక్కడి మంత్రులు, అధికారులకు భారీగా లంచాలిచ్చారట. ఏకంగా రూ. 400 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఆ సంగతి తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

గత సంవత్సరం డిసెంబరులో ఆదాయపు పన్ను అధికారులు శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు చేసినప్పుడు రూ. 34 కోట్ల కొత్త రెండు వేల రూపాయల నోట్లు సహా రూ. 142 కోట్లను రికవరీ చేసిన సంగతి తెలిసిందే. పన్ను ఎగవేత కేసులో సీబీఐ కేసు నమోదు కాగానే ఈ దాడులు జరిగాయి. ఆపై జైలుకెళ్లిన శేఖర్ రెడ్డికి 87 రోజుల అనంతరం బెయిల్ లభించగా, బయటకు వచ్చిన మూడు రోజులకే తిరిగి అరెస్టై జైలుకు వెళ్లారు.

ఇక ఈ తాజా నివేదిక విషయంలో విచారణకు ఆదేశించాలా? వద్దా? అన్నది ప్రభుత్వ నిర్ణయమని విచారణకు ఆదేశిస్తే, మంత్రులు కటకటాల వెనక్కు వెళ్లాల్సి వుంటుందని, ఆదేశించకుంటే, చెడ్డ పేరు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లంచాలు తీసుకున్న తమిళ మంత్రులెవరన్నది ఇంకా పేర్లు బయటకు రానప్పటికీ జనం నోళ్లలో మాత్రం పలు పేర్లు నానుతున్నాయి.