గుణశేఖర్ శాకుంతలంలో మరో హీరోయిన్ చేరిక

భారీ సినిమాలకు పెట్టింది పేరు గుణశేఖర్. రుద్రమదేవి తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ తాజాగా శాకుంతలం సినిమాను ప్రారంభించిన సంగతి తెల్సిందే. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల కథను తెరకెక్కిస్తున్నాడు. ఈ అమర ప్రేమకథలో శకుంతలగా సమంత, ఆమెకు జోడిగా దుశ్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నారు.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం… ఈ చిత్రంలో మరో హీరోయిన్ అదితి బాలన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. అరువి చిత్రం ద్వారా అదితి బాలన్ అందరికీ సుపరిచితం.

ఆమె సినిమా షూటింగ్ లో కూడా ఈ రోజు నుండి పాల్గొంటుందని సమాచారం. అదితి బాలన్ ది కీలకమైన పాత్ర అంటున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సమంత ఈ చిత్రం కోసం ఏకంగా 150 రోజుల కాల్ షీట్స్ ను ఇచ్చిందిట.