20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్దమైన హీరోయిన్‌

తమిళ సూపర్‌ స్టార్‌ అజిత్ భార్య షాలిని ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్ అనే విషయం తెల్సిందే. షాలిని ఒకప్పుడు చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కూడా ఆమెకు మంచి సోషల్ మీడియా ఫాలోయింగ్‌ ఉంది. ఇలాంటి సమయంలో ఆమె రీ ఎంట్రీకి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. షాలిని చివరగా 2001 సంవత్సరంలో పిరియధం వరం వేండుం సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత అజిత్ తో వివాహం పాప ఇలా ఫ్యామిలీ లైఫ్‌ లో ఆమె అడుగు పెట్టింది.

స్టార్‌ హీరో సూర్య భార్య జ్యోతిక రీఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో షాలిని కూడా హీరోయిన్‌ గా కాకున్నా కీలక పాత్రల్లో నటించాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టకేలకు ఆమె నిర్ణయానికి వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక వెబ్‌ సిరీస్ లో ఈమె కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్న ఈ వెబ్‌ సిరీస్ షూటింగ్ లో ఆమె పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే షాలిని సినిమాల్లో కూడా నటిస్తుందనే ఆశతో అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.