సినిమాను త‌ల‌పించే సినిమాటోగ్రాఫ‌ర్ త‌మ్ముడి త‌ప్పుడు ప‌ని

బెయిల్ కోసం ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ త‌మ్ముడు ఓ త‌ప్పుడు ప‌ని చేశాడు. చివ‌రికి అత‌నికి మ‌ళ్లీ జైలే గ‌తైంది. త‌ప్పు చేసి జైలు పాలు కావ‌డ‌మే కాకుండా…అక్క‌డి నుంచి ఎలాగైనా బ‌య‌ట‌ప‌డాల‌నే ఉద్దేశంతో అడ్డ‌దారులు తొక్కాడు. అయితే అత‌ని నిర్వాకం వెంట‌నే వెలుగులోకి వ‌చ్చింది.

టాలీవుడ్ ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు త‌మ్ముడు శ్యామ్ కె నాయుడి నిర్వాకం అచ్చం సినిమాను త‌ల‌పించేలా ఉంది. గ్లామ‌ర్ ఫీల్డ్‌లో అమ్మాయిలను ఎలా ట్రీట్ చేస్తారో అనేక సంద‌ర్భాల్లో బాధితులు త‌మ గోడు చెప్పుకున్న సంద‌ర్భాలున్నాయి. సినీ ఆర్టిస్ట్ సాయి సుధాను పెళ్లి చేసుకుంటాన‌ని శ్యామ్ కె నాయుడు న‌మ్మ‌బ‌లికాడు. ఆ త‌ర్వాత అన్ని ప్రేమ‌, పెళ్లిళ్ల క‌థ‌లాగే సాయి సుధా వ్య‌వ‌హారం కూడా సాగింది.

అయితే త‌న‌ను మోసం చేసిన శ్యామ్ కె నాయుడిని ఎట్టి ప‌రిస్థితిలో విడిచి పెట్టొద్ద‌ని సాయి సుధా నిర్ణ‌యించుకుని న్యాయం కోసం ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌ను ఆశ్ర‌యించింది. పోలీసులు కేసు న‌మోదు చేశారు. అనంత‌రం అత‌న్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత రెండురోజుల‌కే శ్యామ్ జైలు నుంచి బ‌య‌టికి వ‌చ్చాడు.

దీంతో సాయిసుధా షాక్‌కు గురైంది. ఆరా తీస్తే అస‌లు మోసం వెలుగు చూసింది. ఇద్ద‌రూ రాజీ అయిన‌ట్టు శ్యామ్ కె నాయుడు సంబంధిత ప‌త్రాల‌తో పిటిష‌న్ వేశాడు. ఈ నేప‌థ్యంలో నాంప‌ల్లి కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేశాడ‌ని సాయి సుధా గుర్తించింది. దీంతో మ‌రోసారి ఆమె కోర్టు మెట్లెక్కింది.

త‌న సంత‌కం ఫోర్జ‌రీ చేసిన విష‌యాన్ని న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీన్ని న్యాయ‌స్థానం సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించి బెయిల్ ర‌ద్దు చేయ‌డంతో పాటు మ‌రోసారి అత‌న్ని రిమాండ్‌కు ఆదేశించింది. మొత్తానికి సినీఫ‌క్కీలో మోసానికి పాల్ప‌డ్డ చోటా కే నాయుడు త‌మ్ముడు శ్యామ్ కె నాయుడి ఫోర్జ‌రీ క‌థ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.