కొరటాల `ఆచార్య` లానే అట్లీతో ఖాన్ మూవీ?

ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న భారీ మల్టీస్టారర్ `ఆచార్య`పై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. కొరటాలకు క్రియేటివ్ ఫ్రీడమ్ కొరవడడం వల్లనే అలా చినికి చినికి చాంతాడు అయ్యిందన్న గుసగుసలు వైరల్ అయ్యాయి. మొహమాటానికి పోవడం వల్లనే ఇదంతా అంటూ ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే బాలీవుడ్ లో ఇంచుమించు కింగ్ ఖాన్ షారూక్ కూడా ఇలానే చేస్తున్నాడంటూ ఇప్పుడు ఒక లీక్ బయటికి వచ్చింది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం విషయంలో ఖాన్ ఫింగరింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ స్క్రిప్ట్ కోసం అట్లీ చాలా కాలం వర్క్ చేసాడు. కానీ ఖాన్ కి అది పూర్తిగా నచ్చలేదు. అతడు చాలా మార్పులు సూచించాడు. అంతేకాదు.. ఇప్పుడు ఫ్రెండ్లీగా డైరెక్షన్ కూడా చేసేస్తున్నాడనేది తాజా గుసగుస. ఆ మేరకు ప్రముఖ బాలీవుడ్ మీడియా వెలువరించిన కథనం వేడెక్కిస్తోంది.

ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని నిర్ణయించలేదు. కానీ దోస్త్ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికే సినిమాలోని కొంత భాగాన్ని చిత్రీకరించారు. ఇటీవలే ఓ మేజర్ షెడ్యూల్ మొదలైంది. కానీ స్క్రిప్టులో కీలక మార్పులు జరిగాయి. అట్లీ ఒరిజినల్ స్క్రిప్ట్ ను షారుఖ్ చాలా వరకు మార్పులు చేర్పులు కోరినట్టు కూడా టాక్ వినిపిస్తోంది. స్క్రిప్టులో షారుఖ్ ఖచ్చితంగా ఎవరూ ఊహించలేని కొన్ని అంశాలను జోడించారు. స్క్రిప్ట్ లో కొన్ని కోణాలను మార్చేశాడు. షారుఖ్ ప్రమేయంతో స్క్రిప్ట్ ఇప్పుడు చాలా భిన్నంగా మారింది“ అని ఒక లీక్ అందింది.

షారుఖ్ కి నిజానికి డైరెక్షన్ లో “పాసింగ్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ“. అతడు పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నట్లు కూడా సోర్సెస్ వెల్లడిస్తున్నాయి. షారూక్ కేవలం ఘోస్ట్ డైరెక్టర్ కానే కాదు.. అతడే దోస్త్ కి దర్శకత్వం వహిస్తున్నారు అన్న గుసగుస ఇప్పుడు స్ప్రెడ్ అవుతోంది. అట్లీ ఇంకా యంగ్ బోయ్.. హిందీ చిత్రసీమకు కొత్తవాడు. అతను షారూఖ్ సలహాను అనుసరించడాన్ని ఆనందంగా ఫీలవుతున్నాడట.. మొత్తానికి కింగ్ ఖాన్ ఫింగరింగ్ అట్లీ సినిమాలో ఉందన్నది స్పష్ఠమవుతోంది.

కింగ్ ఖాన్ ఎందుకిలా చేస్తున్నారు? అంటే.. అతడు గడిచిన ఐదేళ్లలో సరైన హిట్టు లేక డైలమాలో పడిపోయిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా అన్ని డైలమాల నుంచి బయట పడేందుకు ఒక బంపర్ హిట్ కొట్టేందుకు రకరకాల మార్గాల్ని వెతుకుతున్నారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా అతడు తమిళ దర్శకుడు అట్లీతో భారీ కమర్షియల్ చిత్రానికి సంతకం చేసాడు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది.

షారుఖ్ ఖాన్ నటించిన `పఠాన్` ఇప్పటికే 2023 అతిపెద్ద విడుదలలలో ఒకటిగా ప్రచారం సాగుతోంది. నాలుగు సంవత్సరాల తర్వాత ఖాన్ నుంచి వస్తున్న చిత్రమిది. 2018లో జీరో విడుదలైంది. ఆ తర్వాత పఠాన్ తో లెక్కలు సరిచేయాలని పంతంతో ఉన్నాడు. షారుఖ్ తన స్నేహితుడు రాజ్ కుమార్ హిరాణీతో `డుంకీ`ని లైనప్ చేశాడు. అంతకు ముందే తమిళ దర్శకుడు అట్లీ కుమార్ హిందీ అరంగేట్రం చిత్రంలో కనిపించనున్నాడు. ఇంకా ఈ సినిమాకి టైటిల్ ఖరారు కావాల్సి ఉంది.

ఇది ఏ ఇతర తమిళ చిత్రానికి రీమేక్ కాదు. ఇందులో షారుఖ్ తో పాటు హిందీలో అరంగేట్రానికి నయనతార సిద్ధంగా ఉంది. ప్రతిభావంతులైన ప్రియ మణి – సన్యా మల్హోత్రా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి దోస్త్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా షెడ్యూల్ కి షారూక్ దర్శకత్వం వహిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దర్శకుడి పనిలో వేలు పెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఆచార్య ప్రూవ్ చేసిందన్న గుసగుస నడుమ ఇప్పుడు షారూక్ కూడా అలా చేస్తున్నారా? అన్న కొత్త చర్చ మొదలైంది.