మళ్లీ మొదటికొచ్చిన ‘పవన్ హీరోయిన్’ కథ

“గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తోంది. పవన్-శృతిహాసన్ కలిసి నటిస్తున్నారు. పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ లో శృతిహాసన్ పెర్ ఫెక్ట్ హీరోయిన్.” ఇలా పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు. మరోసారి పవన్-శృతిహాసన్ ను తెరపై చూసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వీళ్లందరి ఆశలపై నీళ్లుచల్లింది శృతిహాసన్.

అవును.. వకీల్ సాబ్ సినిమాలో తను లేనని ప్రకటించింది శృతిహాసన్. ఇప్పటివరకు వచ్చినవన్నీ రూమర్స్ మాత్రమేనని, వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. వకీల్ సాబ్ లో తను పవన్ కు భార్యగా నటిస్తున్నానని, రేపోమాపో సెట్స్ పైకి వెళ్లబోతున్నానంటూ వస్తున్న వార్తల్ని ఖండించింది.

“వకీల్ సాబ్ అవకాశం ఇలా వచ్చి వెళ్లింది. అదింకా ఫైనలైజ్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే, వకీల్ సాబ్ లో నేను నటిస్తున్నాననేది రూమర్ కంటే ఇంకాస్త పెద్దది అనుకోవచ్చు. సో.. వకీల్ సాబ్ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నేను అందులో పవన్ కు భార్యగా నటిస్తున్నానని, ఆల్రెడీ షూట్ కు వెళ్లానని అంటున్నారు. అది వాస్తవం కాదు.”

శృతిహాసన్ స్టేట్ మెంట్ తో వకీల్ సాబ్ హీరోయిన్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. హీరోయిన్ ఫిక్స్ అయితే నెక్ట్స్ షెడ్యూల్ చకచకా పూర్తయిపోతుంది. శృతిహాసన్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కరోనా క్రైసిస్ తగ్గిన వెంటనే సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్నారు. అంతలోనే శృతిహాసన్ ఝలక్ ఇచ్చింది.పవన్ హీరోయిన్ కథ మళ్లీ మొదటికొచ్చింది.