గ్యాంబ్లింగ్ కేసులో ప్ర‌ముఖ న‌టుడి అరెస్ట్‌

లాక్‌డౌన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో గ్యాంబ్లింగ్ కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్న ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు శ్యామ్ స‌హా మ‌రో 13 మందిని కోడంబాక్కం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇత‌ను తెలుగులో కిక్‌, రేసుగుర్రం, క‌త్తి సినిమాల‌తో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ య్యాడు. కిక్ శ్యామ్‌గా పాపుల‌ర్ అయిన శ్యామ్‌కు చెన్నై కోడంబాక్కంలో ఓ క్ల‌బ్ ఉంది. ఇక్క‌డ ఎలాంటి అనుమ‌తి లేకుండా గ్యాంబ్లింగ్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు పోలీసుల‌కు స‌మాచారం అందింది.

కాగా జూదంలో పెద్ద మొత్తంలో డ‌బ్బు పోగొట్టుకున్న‌ మరో ప్రముఖ నటుడి ఫిర్యాదు మేరకు ఈ సోదా చేపట్టినట్టు సమాచారం. అలాగే ఇంట‌ర్‌ చివ‌రి సంవ‌త్స‌రం చదువుతున్న ఒక విద్యార్థి ఆన్‌లైన్‌ గేమ్‌లో రూ. 20 వేలు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న నేప‌థ్యం లో…పోలీసులు ఆన్‌లైన్‌ గేమ్‌లపై విచారణ చేపట్టిన‌ట్టు త‌మిళ‌నాడు పోలీస్ అధికారి తెలిపారు.

న‌టుడి క్ల‌బ్‌పై నిర్వ‌హించిన దాడిలో ఎవ‌రైనా సినీ ప్ర‌ముఖులు దొరికారా? లేదా? అనేది ఇంకా వెల్ల‌డి కాలేదు. ప్ర‌స్తుతం ప‌ట్టుబ‌డిన వారిలో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు స‌మ‌గ్ర స‌మాచార సేక‌ర‌ణ‌లో ఉన్నారు. నుంగంబాక్కంలో నివసిస్తున్న శ్యామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జూదానికి వినియోగించిన టోకెన్లను నుంగంబాక్కం ప్రాంతంలోని అతని అపార్ట్‌మెంట్‌ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.