సిద్ధార్థ్ వంటివారిని పట్టించుకోవద్దు: బీజేపీ

కేంద్ర ప్రభత్వంపై నటుడు సిద్ధార్థ్ చేసే ఆరోపణలు, విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ పేర్కొంది. సిద్ధార్థ్ వంటివారు టైమ్ పాస్ కోసమే అలాంటి ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టింది. తమిళనాడు బీజేపీ నేతలు తన ఫోన్ నెంబర్ లీక్ చేయడంతో పలువురి నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని ఇటీవల సిద్ధార్థ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. తన కుటుంబాన్ని చంపేస్తారనే కాల్స్ వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ఆరోపణలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆయన గతంలో కూడా పలుమార్లు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారని మండిపడ్డారు.

ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ నిర్మల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన ఆహారాన్ని, మందులను పంపిణీ చేయడంలో నిమగ్నమై ఉన్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో హీరో సిద్ధార్థ్ వంటి వ్యక్తులు చేసే విమర్శలను బీజేపీ మద్దతుదారులు ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. అలాంటి వారంతా కేవలం టైమ్ పాస్ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తారని విమర్శించారు. వాటిని పట్టించుకోకుండా ప్రజలకు సాయం చేయడంపైనే దృష్టి పెట్టాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.