మళ్లీ పోలీసులను ఆశ్రయించిన నటి శ్రీసుధ

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌ కే నాయుడు పై గతంలో నటి శ్రీ సుధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. తనను పెళ్లి చేసుకుంటాను అంటూ మోసం చేశాడని శ్రీ సుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు సుదీర్ఘ కాలం నడిచింది. ఇప్పటికి కూడా కోర్టు కేసులో శ్యామ్‌ కే నాయుడు ఉన్నాడు. ఆ కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా రాజీ కి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని శ్రీ సుధ మాత్రం రాజీకి నో అంటుంది. తాజాగా మరో సారి సుధ పోలీసులను ఆశ్రయించి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది.

పలువురు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తాను రాజీకి ఒప్పుకోక పోవడంతో దాడులు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో శ్యామ్‌ కే నాయుడి నుండి తనకు ప్రాణ హాని ఉందని ఏ సమయంలో అయినా అతడు నన్ను చంపించే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. నేను సినిమా పరిశ్రమలో కొనసాగాలంటే రాజీ కుదుర్చుకోవాల్సిందే అంటూ బెదిరిస్తున్నారు. బెదిరింపులకు భయపడేది లేదు అంటూ సుధ అంటుంది. పోలీసులు ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.