మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మ‌వుతున్న సూర్య‌? #surya

ద‌క్షిణాది స్టార్ హీరోల్లో క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత అన్ని ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లు చేసిన హీరో సూర్య‌నే కావ‌చ్చు. అప్పుడ‌ప్పుడూ సింగం లాంటి రెగ్యుల‌ర్ మాస్ సినిమాలు కూడా చేస్తుంటాడు కానీ.. వాటిని ప‌క్క‌న పెడితే సూర్య మిగ‌తా సినిమాల‌న్నీ భిన్నంగానే ఉంటాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నంలో ఉంటాడ‌త‌ను. ఈ వైవిధ్య‌మే సౌత్ ఇండియా అంత‌టా అత‌డికి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. గ‌త కొన్నేళ్ల‌లో స‌రైన విజ‌యాలు లేక సూర్య కొంచెం వెనుక‌బ‌డ్డాడు కానీ.. ఇప్ప‌టికీ అత‌డి ఫాలోయింగ్ ఏమీ త‌గ్గ‌లేదు. త్వ‌ర‌లోనే సూరారై పొట్రు (తెలుగులో ఆకాశ‌మే నీ హ‌ద్దురా)తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు సూర్య‌.

దీని త‌ర్వాత సూర్య హీరోగా తెర‌కెక్కే కొత్త చిత్రాల గురించి ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి. ఐతే వాటి సంగ‌తేమో కానీ.. సూర్య త్వ‌ర‌లోనే డిజిట‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌న్న‌ది తాజా హాట్ న్యూస్. బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్, అభిషేక్ బ‌చ్చ‌న్ లాంటి పెద్ద హీరోలు వెబ్ సిరీస్‌లు చేశారు కానీ.. ద‌క్షిణాది హీరోలు మాత్రం వాటి ప‌ట్ల అంతగా ఆస‌క్తి చూపించ‌ట్లేదు. వెబ్ సిరీస్‌ల‌ను త‌క్కువ‌గా చూస్తున్నారేమో అనిపిస్తోంది. ఐతే భ‌విష్య‌త్తు డిజిట‌ల్ మీడియాదే అని అర్థం చేసుకున్న సూర్య‌.. అందులోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అయిపోయాడ‌ట‌.

లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం నిర్మించ‌బోయే న‌వ‌ర‌స అనే సిరీస్‌లో సూర్య న‌టించ‌నున్నాడ‌ట‌. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సిరీస్‌ను న‌టులు సిద్దార్థ్, అర‌వింద్ స్వామి డైరెక్ట్ చేయ‌నున్నార‌ట‌. వారు ఈ సిరీస్‌తోనే ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం కానున్నార‌ట‌. ఈ కాంబినేష‌న్ సౌత్ ఇండియాలో ఒక సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.