తమన్నా, సత్యదేవ్ ల గుర్తుందా శీతాకాలం ఆగిపోయిందా?

మిల్కీ బ్యూటీ తమన్నా, టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ల కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. కన్నడలో సూపర్ హిట్ సాధించిన లవ్ మాక్ టైల్ చిత్రానికి ఇది రీమేక్. నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు మాత్రమే కాక నిర్మాత కూడా. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది అనుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆగిపోయినట్లు సమాచారం.

గుర్తుందా శీతాకాలం ఆగిపోవడానికి ప్రధాన కారణం బడ్జెట్ సమస్యలు అని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు కష్టకాలం నడుస్తోంది. కోవిద్ కారణంగా చాలా సినిమాలు ఆగిపోతున్నాయి. బడ్జెట్ పెరిగిపోవడాలు, నిర్మాత అప్పుల్లోకి వెళ్లడంతో చాలా సినిమాలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్ ను బాగా తగ్గించాలి లేదా సినిమాను నిలిపివేయాలి. ఈ సమస్యల కారణంగానే గుర్తుందా శీతాకాలం సినిమాను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తమన్నా భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింది. అలాగే సత్యదేవ్ కూడా తన మార్కెట్ కంటే ఎక్కువే తీసుకుంటున్నాడు. ఇక ఆనంద్ ఆడియో ఈ చిత్రం ఆడియో హక్కుల కోసం దాదాపు 75 లక్షల రూపాయలను వెచ్చించింది. కాల భైరవ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.