కోర్టులపై కామెంట్లు చేయను: స్పీకర్ తమ్మినేని

ఏపీ శాశనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను కోర్టులపై కామెంట్లు చేయనని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై స్పందించాలని విలేకరులు కోరగా.. తాను కోర్టులపై కామెంట్ చేయనని చెప్పారు.

దీంతో మీడియా ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. గతంలో ఆయన చాలాసార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవిలో ఉన్నప్పటికీ ఎక్కడా తగ్గేవారు కాదు. సోనియాగాంధీని అత్యంత దారుణంగా తిట్టడంతోపాటు న్యాయస్థానాలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ పాలనా వ్యవస్థలోకి చొరబడి వస్తోందని.. ఖండించాల్సిందేనని పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానాలపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు హైకోర్టు పరిశీలనలో ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో తాజాగా పరిషత్ ఎన్నికల విషయంలోనూ తమ్మినేని తీవ్రంగా స్పందిస్తారని మీడియా ప్రతినిధులు భావించారు. కానీ తమ్మినేని తన శైలికి భిన్నంగా సైలెంటుగా ఉండటం చర్చనీయాంశమైంది.