పవర్‌ స్టార్‌ గుండెల్లో ఉంటాడు: వైష్ణవ్‌ తేజ్‌

మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ తొలిసారి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. కృతీ శెట్టి కథానాయిక. ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్రయూనిట్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా తనకెంతో నేర్పించిందని చెప్పుకొచ్చాడు. షూటింగ్‌ సమయంలో లైట్‌ పెట్టేటప్పుడు ఒకతని కాలు విరిగిపోయినా సరే అలాగే రెండు రోజులు పని చేశాడని చెప్తూ లైట్‌మన్లకు, కాస్ట్యూమ్‌ డిజైనర్లకు, సౌండ్‌ డిపార్ట్‌మెంట్‌కు, ఇలా ప్రతి ఒక్క విభాగానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు.

‘ఉప్పెన’ సినిమాలో కథే హీరో అని చెప్పాడు. తను కేవలం ఓ ప్రధాన పాత్ర పోషించానని పేర్కొన్నాడు. కృతీ శెట్టి వారంలోనే తెలుగు నేర్చుకుందని ప్రశంసించాడు. తన మీద నమ్మకముంచిన సుకుమార్‌కు ధన్యవాదాలు తెలిపాడు. సినిమాకు అసలు ప్రాణం దేవి శ్రీప్రసాద్‌.. ఆయన పాటల వల్లే మా అందరికీ గుర్తింపు వచ్చిందన్నాడు. ఇంతలో అక్కడి అభిమానులు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అని అరుస్తుండటంతో “పపర్‌ స్టార్‌ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటాడు” అని పేర్కొన్నాడు. దీంతో అభిమానుల కేరింతలు, ఈలలతో సభాప్రాంగణం హోరెత్తిపోయింది. కాగా ఇంత మంది జనాల ముందుకు రావడం వైష్ణవ్‌కు ఇదే తొలిసారి కావడంతో కొంత బెరుకుగా కనిపించాడు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు.