జయమ్మ ఈసారి బన్నీకి ఎదురెళ్ళబోతోంది!

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో ఇప్పుడు చక్రం తిప్పుతోంది. తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ చిత్రంతో వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో విలన్ పాత్ర పోషించినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్ మాత్రం టాలీవుడ్ లో ఆమెకు పూల బాట వేసింది.

క్రాక్ లో జయమ్మ రోల్ వరలక్ష్మికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే రీసెంట్ గా విడుదలైన అల్లరి నరేష్ నాంది చిత్రంలో కూడా వరలక్ష్మి చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ రెండు సినిమాల ఫలితాలు టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్ల వెల్లువ వచ్చేలా చేస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం వరలక్ష్మి శరత్ కుమార్, అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో విలన్ గా కనిపించబోతోంది. పుష్ప తర్వాత కొరటాల శివ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఆ సినిమాలో రాజకీయ నాయకురాలి పాత్రను వరలక్ష్మికి ఆఫర్ చేసారు.