ప్రజలను తిట్టిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పారు: విజయసాయి రెడ్డి

విజయవాడ, గుంటూరుల్లో ప్రజలను తిట్టి, రెచ్చగొట్టిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. హైదరాబాద్ లో పాచి పనులకు వెళ్తారా అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల సమయంలో చంద్రబాబు, లోకేశ్ ముఖం చాటేశారని అన్నారు. మూడు రాజధానులకు ప్రజలు అంగీకరించినట్టు ఈ ఎన్నికల ఫలితాలే తేల్చాయని అన్నారు.

ఎల్లో మీడియా రఘురామకృష్ణ రాజును, సబ్బం హరిని ముందుకు తీసుకొస్తాయని.. ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఈవీఎం టాంపరింగ్ జరిగిందన్న చంద్రబాబు.. మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లలో జరిగాయి కదా.. ఏమైంది మీ ఆరోపణ అని వ్యంగ్యంగా అన్నారు. విశాఖలో కొన్ని వార్డుల్లో ఎందుకు ఓడిపోయామో విశ్లేషిస్తామన్నారు. మరో 25 ఏళ్లు ఏపీ సీఎంగా జగనే ఉంటారని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి అన్నారు.