విసారె జ్ఞాన గుళిక: ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!

‘‘డబ్బు, పరువు, ఆస్తి, అంతస్తు.. ఇవన్నీ సంపాదించవచ్చు. కానీ, ఆ సంపదతో జ్ఞానాన్ని కొనలేము. మనసులో వున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు, జ్ఞానం సంపాదించే దారిలో అడుగు పెట్టినట్లే..’’ అంటూ వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి ‘శనివారం ఆలోచనల్ని’ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

విసారె చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజమే. కానీ, ఆ వెంటనే.. మరో రెండు ఆసక్తకికరమైన ట్వీట్లేశారు విజయసాయిరెడ్డి. ‘చంద్రబాబు ఎన్నికల్ని బహిష్కరించాడా.. లేదా ఏపీ ప్రజలే చంద్రబాబుని బహిష్కరించారా? లోకల్ బాడీలు చంద్రబాబుని భయపెడుతున్నాయా.. లేక లోకేష్ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబుని భయపెడుతోందా.?’ అన్నది ఓ ట్వీటు.

మరో ట్వీటులో ‘ఒక పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు.. వరస ఓటములతో నాయకత్వంపై క్యాడర్‌కు నమ్మకం పోతుంది.. శ్రేణులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటాయి.. పోటీకి అభ్యర్థులు దొరకరు.. ఏవో సాకులు చూపి ఎలక్షన్లకు దూరంగా వుంటామని నాయకత్వం ప్రకటిస్తుంది.. కేల్ ఖతం.. దుకాణం బంద్..’ అని వివరించారు. ఇదీ జ్ఞానమంటే.

అసలు ఇంతటి జ్ఞానం విజయసాయిరెడ్డికి ఎలా సొంతమైంది.? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీన్ని జ్ఞానం అనాలో, అజ్ఞానం అనాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. రాజకీయాల్లో నిన్నటి ఈక్వేషన్లకీ, నేటి ఈక్వేషన్లకీ, రేపటి ఈక్వేషన్లకీ పొంతన వుండదు. నిన్నటి అదికారం నేడు వుండకపోవచ్చు.. నేడు లేని అధికారం రేపు దక్కొచ్చు. కాంగ్రెస్ ఒకప్పుడు ఏ స్థాయిలో విర్రవీగిందో చూశాం.. టీడీపీ విర్రవీగిన వైనమూ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీ విర్రవీగుతోందంతే. ఎవరి ఖేల్ ఎలా వుండాలో, ఎవరి దుకాణం ఎప్పుడు బంద్ చేయాలో.. ప్రజలే నిర్ణయిస్తారు రాజకీయాల్లో.

ప్రత్యర్థులు బరిలో నిలబడకుండా చేసేసి, ఏకగ్రీవాలంటూ దిక్కుమాలిన రాజకీయాలు చేసేసి.. ‘మేమే గెలిచేశాం..’ అని చెప్పకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? ‘ఓటేస్తే తప్ప సంక్షేమ పథకాలుండవ్..’ అని బెదిరించే రాజకీయ పార్టీలకు భవిష్యత్తు వుండదని చంద్రబాబుతోనే తేలిపోయింది.. ఆ చావు దెబ్బ వైసీపీకి కూడా తగిలేందుకు పెద్దగా సమయం పట్టకపోవచ్చ.

అంతేనా, అతి త్వరలో బెయిల్ రద్దవబోతోంది.. అంటూ బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. సో, టీడీపీ దుకాణం మాత్రమే కాదు.. వైసీపీ దుకాణం కూడా త్వరలో బంద్ కాబోతోందన్నమాట. పాపం విసారెడ్డికే ఇంకా వాస్తవం అర్థం కావడంలేదు.