ఏంటమ్మా.. కొహ్లీని ర్యాగింగ్ చేస్తున్నావా?

క్రికెటర్లకు స్టేడియంలో అభిమానుల అరుపులు ఇచ్చే ఎనర్జీ ఇంకేమీ ఇవ్వలేవు. కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ పండగ ఐపీఎల్ కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఇంట్లో మొబైల్ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆటపట్టిస్తోంది ఆయన సతీమణి అనుష్క శర్మ.

‘ఏయ్ కోలీ… కోలీ… ఫోర్ కొట్టు… ఫోర్… ఏం చేస్తున్నావ్’ అంటూ అరుస్తూ కెప్టెన్‌ను ర్యాగింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనుష్క. భార్య అలా అరుస్తుంటే… చూసి పట్టించుకోనట్టు మొబైల్‌లో మునిగిపోయాడు విరాట్. ‘నాకు తెలుసు తను క్రికెట్ ఫీల్డ్‌ను బాగా మిస్ అవుతున్నాడని! కోట్ల మంది అభిమానుల ప్రేమను కూడా. అలాగే ఇలాంటి స్పెషల్ ఫ్యాన్స్‌ను కూడా కోహ్లీ మిస్ అవుతూ ఉండొచ్చు. అందుకే నేను ఆ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేశా’ అంటూ కామెంట్ చేసింది అనుష్క. ఈ వీడియోకు అభిమానులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది.

‘కనీసం సిక్స్ అయినా కొట్టమని డిమాండ్ చేయాలి’ అంటూ అర్జున్ కపూర్ కామెంట్ చేయగా… ‘నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నామంటూ’ పూజా హెగ్దే, తదితర బాలీవుడ్ సెలబ్రిటీస్ కామెంట్ చేశారు. క్రికెట్ ఫీల్డ్‌లో కానీ, బయట కానీ తనను ట్రోల్ చేయాలని చూసినవారికి గట్టిగా కౌంటర్ ఇస్తాడు విరాట్ కోహ్లీ.
ఆ ఆవేశం, కోపం కారణంగానే కోహ్లీతో గొడవ పడడానికి చాలామంది భయపడతారు. అలాంటి యాంగ్రీ యన్ మ్యాన్‌ను ర్యాగింగ్ చేస్తూ ఇంట్లో తానే బాస్‌నని నిరూపిస్తోంది అనుష్క.

సినిమాలు, క్రికెట్ షెడ్యూల్స్‌తో చాలా బిజీగా ఉండే ఈ సెలబ్రిటీ కపుల్స్‌కు ఇప్పుడు కావాల్సినంత ఏకాంతం దొరికింది. లాక్‌డౌన్‌లో ఈ ఇద్దరూ ఇంట్లో ఉంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం విరాట్‌ కోహ్లీకి అనుష్క శర్మ హెయిర్ కట్టింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఆడుకుంటూ, దీపాలు పెడుతూ… ఇలా అనుకోకుండా దొరికిన హాలీడేస్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకుంటున్నారీ కపుల్.