తమ్ముడిని గట్టెక్కిస్తాడా?

సూర్య తమ్ముడు కార్తీకి చెప్పుకోతగ్గ హిట్లున్నాయి, నటుడిగాను మంచి పేరుంది. కానీ ఈమధ్య కాలంలో అతనికి ఏదీ కలిసి రావడం లేదు. ఊపిరి తెలుగులో నాగార్జున ఫ్యాక్టర్‌ వల్ల బాగానే ఆడింది కానీ తమిళంలో డిజాస్టర్‌ అయింది.

ఈ చిత్రంపై తాను ఇరవై కోట్లు నష్టపోయానంటూ నిర్మాత పివిపి ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్తీ చాలా కష్టపడి చేసిన ‘కాష్మోరా’ చిత్రం కూడా తనకి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందులో కార్తీ పడ్డ కష్టానికి ప్రశంసలు దక్కాయి కానీ కోరుకున్న విజయం మాత్రం వరించలేదు. అసలే తమిళ చిత్ర సీమలో శివ కార్తికేయన్‌, విజయ్‌ సేతుపతిలాంటి హీరోల హవాతో కార్తీలాంటి వాళ్లకి మంచి కథలు దొరకడం లేదు.

అయిదారు కోట్ల లోపు సినిమాలతోనే కొందరు తమిళ హీరోలు అదరగొట్టేస్తున్నారు. దీంతో బడ్జెట్‌ ఎక్కువయ్యే కార్తీ వైపు రావడానికి నిర్మాతలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కార్తీకి ఇప్పుడొక భారీ హిట్‌ చాలా అవసరం. ఇలాంటి టైమ్‌లో వస్తోన్న ‘చెలియా’ చిత్రం మీదే కార్తీ ఆశలన్నీ పెట్టుకున్నాడు. మణిరత్నం మ్యాజిక్‌ వర్కవుట్‌ అయి ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుందని కార్తీ నమ్ముతున్నాడు. ‘ఓకే బంగారం’ చిత్రాన్ని నేటితరం యువత రిలేట్‌ చేసుకునేలా తీర్చిదిద్దడంతో మణిరత్నంలో ఇంకా పస అయిపోలేదని ప్రూవ్‌ అయింది. కాకపోతే ఆయననుంచి మళ్లీ ‘సఖి’ లాంటి బ్లాక్‌బస్టర్‌ వస్తుందా అనేది వేచి చూడాల్సిందే. కార్తీ మాత్రం ఈ సినిమాతో తన రాత మారిపోతుందని కలలు కంటున్నాడు.