బన్నీకోసం డబ్బులు పెట్టేదెవరు?

అల్లు అర్జున్ అంటే ఇప్పుడు హాట్ ప్రాపర్టీ. కన్సిస్టెన్సీ తీసుకుంటే మార్కెట్ పరంగా పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుల తర్వాతి స్థానం అతడిదే ఇప్పుడు. ‘సరైనోడు’ సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేశాడు బన్నీ. అతడి సినిమా అంటే మినిమం రూ.60 కోట్ల బిజినెస్ ఈజీగా అయిపోతుంది. బడ్జెట్ కూడా రూ.50 కోట్లు దాటించేసినా ఇబ్బందేమీ లేదు.

ఈ నేపథ్యంలో బన్నీ సైతం మహేష్ బాబు బాటలో నడుస్తున్నాడు. తనతో కమిట్మెంట్లున్న నిర్మాతల్లో ఇద్దరు ముగ్గురిని ఒక సినిమాకు జాయిన్ చేసే పనిలో పడ్డాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ చేయబోయే తర్వాతి సినిమాను ముగ్గురు ప్రొడ్యూసర్లు కలిసి నిర్మిస్తారట.

ఆ ముగ్గురు నిర్మాతల్లో నాగబాబు కూడా ఉండటం విశేషం. రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ దెబ్బకు నాగబాబు కుదేలైపోయిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బతో ‘అంజనా ప్రొడక్షన్స్’ మూతపడిపోయింది. ఈ మధ్య నాగబాబు మళ్లీ కుదురుకుని ఆర్థికంగా స్థిరపడినప్పటికీ.. సొంతంగా అయితే సినిమాలు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బన్నీ సినిమాకు ఒక నిర్మాణ భాగస్వామిగా చేరితో రిస్క్ ఉండదని నాగబాబు భావించాడు. బన్నీనే ఆయన్ని ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చినట్లు సమాచారం.

ఈ చిత్రానికి లగడపాటి శ్రీధర్ లీడ్ ప్రొడ్యూసర్ కాగా.. ‘గీతా ఆర్ట్స్’లో కీలక పాత్రధారి అయిన బన్నీ వాసు కూడా ఒక నిర్మాతగా ఉంటాడట. బన్నీ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. ఈ చిత్రానికి ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.