ఐటీ రంగంలో సంక్షోభం తప్పదా..?

ఐటీ రంగంలో ఏం జరగబోతోంది..? సంక్షోభం తప్పదా..? అవుననే అంటున్నాయి రెండు టాప్ కంపెనీల సీఈవో, ఛైర్మన్ రాసిన లేఖలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రోలు తమ ఉద్యోగుల్ని హెచ్చరిస్తూ న్యూఇయర్ విషెస్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవడం నుంచి డీమానిటైజేషన్ దాకా ఐటీ రంగం ఎన్ని సవాళ్లు ఎదుర్కుంటుందో వివరించారు ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా. ఇన్ఫోసిస్ చాలా విజయాలు సాధించిందని చెబుతూనే.. 2017లో జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పకనే చెప్పారు.

అటు విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ సంక్షోభం జోలికి వెళ్లకుండా మానవీయ విలువలు పెంచుకోవాలని సిబ్బందికి వివరించారు. జీవితంలో సవాళ్లు మామూలేనని, కానీ ప్రకృతితో మమేకమవ్వాలని ప్రేమ్ జీ పిలుపునిచ్చారు. పనిలోపనిగా తన రాజస్థాన్ టూర్ విశేషాలు పంచుకున్నారు.

సాధారణంగా ఐటీ కంపెనీలు న్యూఇయర్ ను చాలా ఆశావహంగా ప్రారంభిస్తాయి. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్సైంది. దీంతో ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. ఎవరి జాబ్ ఉంటుంది, ఎవరి జాబ్ పోతుంది అని లెక్కలేసుకుంటున్నారు.