బాలికలకు బ్రాండెడ్ న్యాప్ కిన్లు పంపిణీ చేయాలి: సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న 7 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా న్యాప్ కిన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. మహిళా దినోత్సవం రోజున ఉచిత న్యాప్‌కిన్ల పంపిణీ పథకం ప్రారంభం కావాలన్నారు. దీంతో.. ఏప్రిల్ 15 నాటికి టెండర్లు పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి కంపెనీలతో ఎంఓయూ చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాలికలు అందరికీ బ్రాండెడ్ క్వాలిటీ న్యాప్ కిన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.