విశాఖ ఉక్కు కర్మాగారంపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. తాడేపల్లిలో సీఎం జగన్‍ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ విషయంలోనూ నేను వ్యతిరేకించా. ఇవేమీ ఇంటి ఆస్తులు కాదు ఒక్కోటి అమ్మడానికి. చక్కగా నడుస్తున్న స్టీల్‍ప్లాంట్‍ను ప్రైవేటీకరించడం సరికాదు. స్టీల్‍ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానికి సీఎం జగన్ రెండుసార్లు లేఖలు రాశారు. అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాల నేతలను తీసుకొస్తానని కూడా చెప్పారు.

ప్రభుత్వం వ్యాపారం చేయోచ్చా? లేదా? అనేది కేస్ బై కేస్ ఆలోచించాల్సి ఉంది. ప్రతిదాన్ని ప్రైవేటీకరించడం మంచిది కాదు. అందుకు బలమైన కారణాలు ఉండాలి. టీటీడీ ఖాతాలను కాగ్ తో ఆడిట్ చేయించాలన్న సీఎం జగన్ నిర్ణయం సముచితం. టీటీడీని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చాలి. టీటీడీని భక్తులే నడిపించేలా చేయాలి’ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.