అరెస్టుల పర్వం.. ఇదో ప్రసహనం.. తర్వాతేంటి.?

వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది టీడీపీ నేతల అరెస్టులు జరిగాయి. ఈఎస్ఐ మెడికల్ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు.. ఓ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు.. ఈ కేసుల్లో ఇరువురూ కొన్ని రోజులపాటు జైల్లో వున్నారు. ఇటీవల మరో మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టయిన విషయం విదితమే.

తాజాగా, టీడీపీకి చెందిన పట్టాభి తదితరుల్ని అరెస్ట్ చేశారు.. అదీ టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడులకు సంబంధించి. ఆ దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలు. అయితే, ముఖ్యమంత్రి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, సమాజంలో అలజడిని సృష్టించేందుకు కారణమయ్యారన్నది పట్టాభిపై మోపబడ్డ అభియోగం.

గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని కూడా ఇలాగే అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆయన మీద పోలీసు కస్టడీలో దాడి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు విచారణ సాగుతూ సాగుతూ వుందలా. తన మీద కస్టడీ దాడి జరగకూడదన్న ఉద్దేశ్యంతో ముందస్తుగానే పట్టాభి తన శరీరం మీద ఎలాంటి గాయాలూ లేవంటూ ‘అర్థనగ్నంగా’ థన శరీరాన్ని అరెస్టుకి ముందు చూపిస్తూ వీడియో తీసి వదిలారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, పోలీసుల పనితీరు ఎలా వుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? పట్టాబి అరెస్టయ్యారు.. టీడీపీకి చెందిన మరికొందరు అరెస్టయ్యారు. తర్వాతేంటి.? ఇంతకీ, టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్ని అరెస్టులు జరిగాయి.?

రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడిన, పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తల వైపు పోలీసులు కన్నెత్తి చూసే పరిస్థితి వుండడంలేదన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ. వైసీపీ కార్యకర్తల్ని.. వాళ్ళెంతటి అకృత్యాలకు, అరాచకాలకు పాల్పడుతున్నా పోలీసులు అరెస్టు చేయడంలేదన్న విషయాన్ని పక్కన పెడితే, టీడీపీ నేతలపై పోలీసులు పెట్టిన చాలా కేసులు అసలు నిలబడే పరిస్థితే కనిపించడంలేదన్నది ఇంకో వాదన.

అరెస్టవడం, ఒక్కోసారి రిమాండుకి వెళ్ళడం.. ఆ తర్వాత బెయిల్ తెచ్చుకోవడం.. ఇదో ప్రసహనంగా మారిపోయింది. టీడీపీ నేతల్ని అరెస్టు చేయించి, పైశాచికానందం పొందేందుకే తాము అధికారంలోకి వచ్చామన్నట్టుంది వైసీపీ తీరు. చాలా కేసుల్లో పోలీసులు న్యాయస్థానాల్లో చీవాట్లు తింటోన్న వైనాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.