ఎట్టకేలకు అప్ డేట్స్ ఇచ్చిన నితిన్

తన కొత్త సినిమాకు సంబంధించి ఎట్టకేలకు అప్ డేట్స్ అందించాడు నితిన్. ఫిబ్రవరి 12న ఫస్ట్ లుక్, వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న టీజర్, ఇక సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో పాటు పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

లై సినిమా డిజాస్టర్ తర్వాత పూర్తిగా కనిపించడం మానేశాడు నితిన్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేస్తున్న తన 25వ సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రానివ్వలేదు.దీంతో ఒక దశలో ఈసినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా ప్రారంభమైంది. తన సినిమా ఆగిపోలేదని, షూటింగ్ కంప్లీట్ అయిందని కొన్నాళ్ల కిందట క్లారిటీ ఇచ్చిన నితిన్, ఇప్పుడు ఒకేసారి సినిమా ఫస్ట్ లుక్, టీజర్ డేట్స్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించాడు.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. నితిన్ ప్రకటన బట్టి చూస్తుంటే.. ఫిబ్రవరి 12న ఫస్ట్ లుక్ పాటు టైటిల్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీకి “గుర్తుందా శీతాకాలం” అనే వెరైటీ టైటిల్ ప్రచారంలో ఉంది. మరి ఆ పేరునే ఫిక్స్ చేస్తారా లేక మరో టైటిల్ ఎనౌన్స్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. లై సినిమాలో తన సరసన హీరోయిన్ గా నటించిన మేఘా ఆకాష్ నే, కొత్త సినిమాలో కూడా రిపీట్ చేస్తున్నాడు నితిన్.