త్రివిక్రమ్ తో సినిమా.. జర జాగ్రత్త ఎన్టీఆర్!

అజ్ఞాతవాసి మూవీ రిజల్ట్ తో పవన్ ఫ్యాన్స్ అంతా బిక్కచచ్చిపోయారు. పవనిజం మొత్తం చల్లారిపోయింది. అయితే అజ్ఞాతవాసి రిజల్ట్ తో బుక్ అవ్వడం పవన్ అభిమానుల వంతయితే.. సేమ్ టైం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఒకింత ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం త్రివిక్రమ్ తన నెక్ట్స్ సినిమాను యంగ్ టైగర్ తో ప్లాన్ చేయడమే.అజ్ఞాతవాసిని అడ్డదిడ్డంగా తీసిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను ఇంకెంత కిచిడీ చేస్తాడేమోనని తారక్ ఫ్యాన్స్ భయం. అభిమానుల్లో ఉన్న ఈ ఫీలింగ్ ఎన్టీఆర్ వరకు కూడా చేరింది. దీంతో ఇతడు కూడా డైలమాలో పడినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి. మూవీ కూడా లాంచ్ అయింది. అంటే.. త్రివిక్రమ్ చెప్పిన స్టోరీలైన్ కు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టే. కాకపోతే ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే రెడీ అయిందా లేదా అనేది ప్రస్తుతానికి డౌట్.స్క్రీన్ ప్లేతో పాటు స్టోరీ మొత్తం ఎన్టీఆర్ విన్నట్టయితే.. మరోసారి పునరాలోచించుకోవడం బెటర్. ఒకవేళ ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లే సిద్ధంకాకపోతే మాత్రం దగ్గరుండి తారక్ ఆ పని పూర్తిచేయించుకోవడం మంచిది. ఎందుకంటే అజ్ఞాతవాసి రిజల్ట్ దృష్ట్యా.. స్క్రీన్ ప్లే బాధ్యత మొత్తాన్ని త్రివిక్రమ్ కు అప్పగించడం ఈ పరిస్థితుల్లో మంచిది కాదు.

అజ్ఞాతవాసి కథను ఫోన్ లో పవన్ కు వినిపించాడట త్రివిక్రమ్. కేవలం 10నిమిషాల ఫోన్ సంభాషణతో పవన్ ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని త్రివిక్రమ్ స్వయంగా వెల్లడించాడు. తన ఆత్మలాంటి త్రివిక్రమ్ పై ఉన్న నమ్మకంతో సినిమా మొత్తాన్ని అతడికి వదిలేశాడు పవన్. అంతిమంగా రిజల్ట్ ఏంటనేది మనం చూస్తున్నాం.

ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దని ఎన్టీఆర్ కు సూచిస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ ను మొహమాటం లేకుండా పక్కనపెట్టగల తెగింపు, నేర్పు ఎన్టీఆర్ కు ఉంది. గతంలో కొంతమంది దర్శకుల విషయంలో ఇలా వ్యవహరించాడు. అయితే త్రివిక్రమ్ విషయంలో తారక్ ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకోలేడు కాబట్టి స్టోరీ, స్క్రీన్ ప్లే, మేకింగ్ విషయంలో దగ్గరుండి అన్నీ చూసుకోవాలని ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ మెసేజీలు పెడుతున్నారు.