ఫిదా.. ఆ మైలురాయిని దాటేసింది

అనుకున్నదే అయింది. మెగా కుర్రాడు వరుణ్ తేజ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మైల్ స్టోన్‌ను దాటేశాడు. పవన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’ అమెరికాలో నెలకొల్పిన లాంగ్ స్టాండింగ్ కలెక్షన్ల రికార్డును వరుణ్ మూవీ ‘ఫిదా’ దాటేసింది. అత్తారింటికి దారేది నాలుగేళ్ల కిందట యుఎస్‌లో 1.87 మిలియన్ డాలర్ల వసూళ్లతో అప్పటికి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

తర్వాత ఆ కలెక్షన్లను వేరే సినిమాలు దాటేసినప్పటికీ.. మెగా ఫ్యామిలీ హీరోల వరకు అదే రికార్డుగా నిలిచింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నంబర్ 150’ ఆ కలెక్షన్లను దాటేసింది. ఇప్పుడు చిరు తర్వాత రెండో స్థానానికి వరుణ్ చేరుకున్నాడు. ‘ఫిదా’ మొన్న ఆదివారం నాడు.. ‘అత్తారింటికి దారేది’ కలెక్షన్లను దాటేసింది.

ఆదివారం నాటికే ‘ఫిదా’ వసూళ్లు 1.91 మిలియన్ డాలర్లకు చేరువగా వెళ్లడం విశేషం. ఈ సినిమా ఫుల్ రన్లో 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం కూడా గ్యారెంటీనే అనిపిస్తోంది. ఐతే ఈ వీకెండ్లో ఒకేసారి ‘లై’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జయ జానకి నాయక’ లాంటి మూడు క్రేజున్న సినిమాలు ఒకేసారి విడుదలవుతున్న నేపథ్యంలో ‘ఫిదా’ మరీ ఎక్కువ ఆశలేమీ పెట్టుకోవడానికి లేదు. ఐతే ఇప్పటికే అమెరికాలో సాధించిన దానికి ‘ఫిదా’ టీం చాలా సంతోషించాలి.

రెండో వీకెండ్‌కే జోరు తగ్గిపోతున్న ఈ రోజుల్లో మూడో వారంలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లే రాబట్టింది. మరోవైపు ‘ఫిదా’ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ మంచి వసూళ్లే రాబడుతోంది. ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.40 కోట్ల షేర్ మార్కును అందుకుంటుందని భావిస్తున్నారు.