బర్త్ డే సంబరాల్లో మునిగి.. ప్రమోషన్ గాలికి..!

నిన్న తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది హీరోయిన్ రాశి ఖన్నా. మొన్న రాత్రి నుంచే సంబరాలు షురూ అయిపోయాయి. టాలీవుడ్ లో రాశికి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రకుల్ ప్రీత్, లావణ్య త్రిపాఠి, సుశాంత్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, రవితేజ ఇలాచాలామంది ఈ పార్టీకి వచ్చారు. అంతా కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

ఈరోజుకి కూడా ఆమె ఇంకా తన బర్త్ డే మూడ్ నుంచి బయటకు రాలేదు. తన ఖాతాలో ఫొటోలు షేర్ చేస్తూనే ఉంది. ఈ సంబరాల్లో మునిగి తను నటించిన ఆక్సిజన్ సినిమాను పూర్తిగా పక్కనపెట్టేసింది రాశిఖన్నా. ఈ సినిమాకు సంబంధించి ఆమె ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

సాధారణంగా హీరోలైనా, హీరోయిన్లయినా తమ సినిమా థియేటర్లలోకి వస్తుందంటే సోషల్ మీడియాలో కాస్త హల్ చల్ చేయడం సహజం. రాశి మాత్రం ఆక్సిజన్ విషయంలో అలాంటిదేం చేయలేదు. తనకు ఆ సినిమాతో సంబంధం లేనట్టే వ్యవహరించింది. ఈ సినిమాకు మొదట్నుంచి దూరంగానే ఉంది రాశిఖన్నా. మరో హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ మీడియాముందుకొచ్చింది కానీ రాశి మాత్రం రాలేదు.

నిజానికి ఆక్సిజన్ కు సంబంధించి రాశి చేసుకున్న అగ్రిమెంట్ ఎప్పుడో పూర్తయింది. ఆమె ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే గోపీచంద్, అను ఎమ్మాన్యుయేల్ కు కూడా అంత అవసరం లేదు. కానీ వాళ్లు కాస్తోకూస్తో ప్రమోట్ చేశారు. రాశి ఖన్నా మాత్రం కనీసం సోషల్ మీడియాలో కూడా ఆక్సిజన్ ప్రస్తావన తీసుకురాలేదు.