స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని వీడటం అనేది ఓపెన్ సీక్రెట్. ఆయన పార్టీని వీడటం కాదు, వీడేలా చేశారు. కాదు కాదు, పార్టీ నుంచి గెంటేశారనడం కరెక్టేమో. దీన్నే వెన్నుపోటు అని చంద్రబాబు వ్యతిరేకులంటారు. స్వయానా ఎన్టీఆర్ కూడా అదే మాట చెప్పారు. కానీ, చంద్రబాబు అండ్ కో మాత్రం దాన్ని ‘అధికార మార్పిడి’ అంటుంది.
సరే, చంద్రబాబు – స్వర్గీయ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినా, అది ‘అధికార మార్పిడి’గానే ప్రొజెక్ట్ అయ్యిందన్నది ఓపెన్ సీక్రెట్. వెన్నుపోటు తర్వాత చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవడం, ఇవన్నీ ఆనాటి ఆ ‘అధికార మార్పిడి’కి ప్రజలు ఓటేయడానికి నిదర్శనమంటారు కొందరు. అది గతం. దాన్ని ఇప్పుడు తవ్వడం వల్ల ప్రయోజనమేంటి.? అన్నది ఇక్కడ కీలకం.
చంద్రబాబుని ఎన్టీఆర్ ఆత్మ ఎప్పటికీ వెంటాడుతూనే వుంటుంది. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అలాగని, ఆనాటి ఆ ఘటనపై ఎంత కొత్తగా ప్రచారం చేసినా, కొత్తగా చంద్రబాబుకి కలిగే నష్టం.. ఆ ప్రచారం చేసినవారికి లాభం వుండవుగాక వుండవు. కానీ, రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో చంద్రబాబు అండ్ కో భయపడేలా చెయ్యాలనుకుంటున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్.
ఈ దీపావళి సంగతేమోగానీ, వచ్చే దీపావళికి ఎన్టీఆర్ ఆత్మ అంటించే లక్ష్మీ బాంబులు చాలా చాలా పేలబోతున్నాయి అంటూ వర్మ తాజాగా సోషల్ మీడియాలో ‘పోస్టింగ్’ చేసి ‘దీపావళి’ శుభాకాంక్షల్ని వెరైటీగా చెప్పేశాడు. ‘వంగవీటి’ సినిమా తీసి వర్మ ఏం సాధించినట్టు.? రాజకీయాలేమీ ప్రభావితం కాలేదు ఆ సినిమాతో. ‘రక్తచరిత్ర’ సినిమాతో ఏమన్నా మారిందా.?
వర్మ అయాకత్వం కాకపోతే, స్వయంగా ఎన్టీఆర్ తనకు చంద్రబాబు చేసిన అన్యాయం గురించి మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.. అలాంటిది, వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసేస్తే, దాన్ని జనం అంత సీరియస్గా తీసుకుంటాడని ఎలా అనుకోగలం.?