శర్వానంద్-దండుపాళ్యం

ఇలా అంటే ఇదేం ముడి అనుకుంటారు. నిజమే కదా? దండుపాళ్యం లాంటి నాడు వయిలెన్స్ సినిమాకు, శర్వానంద్ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ హీరోకు ముడేమిటి? అయినా పడింది. ఎలా అంటే, దండుపాళ్యం వన్, టూ అంటూ సిరీస్ అందించిన దర్శకుడు శ్రీనివాస రాజు ఓ కథ చెప్పి శర్వానంద్ ను ఒప్పించాడు.

శర్వానంద్ ను ఒప్పించగలిగిన కథేంటీ? ఆ జొనర్ ఏంటీ అన్నది ఇంకా బయటకు రాలేదు కానీ, కథ విన్నశర్వా వెంటనే ఓకె చేసి, నిర్మాతను కూడా తానే సెట్ చేసేసాడు. అయితే ఈ సినిమా ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో కాక, కాస్త సీరియస్ జోనర్లోనే వుంటుందని వినిపిస్తోంది.ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఆ సినిమాను నిర్మిస్తారు. ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలు కమిట్ అయివున్నాడు. ఒకటి హను రాఘవపూడి డైరక్షన్ లో. మరొకటి సుధీర్ వర్మ దర్శకత్వంలో.

ఈ రెండు కాక, దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా అని వినిపిస్తోంది. ఇప్పుడు శ్రీనివాసరాజు-ఎకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాలుగోది అన్నమాట. ఏ సినిమా ఎప్పుడు వున్నా, ఎకె సినిమాను మాత్రం జూన్ నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.