శ్రీదేవిపై తీవ్రమైన కోపం.. అతడొక్కడికే!

తక్కువ వ్యవధిలోనే ఇద్దరు భార్యలనూ పోగొట్టుకున్నాడు బోనీ కపూర్. ఈ బాలీవుడ్ బడా ప్రొడ్యూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్ దాదాపు ఆరేళ్ల కిందట మరణించింది. ఆమెతో 1996లోనే విడాకులు తీసుకున్నాడో బోనీ. 1983లో బోనీ కపూర్ కు మోనాతో పెళ్లి అయ్యింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అర్జున్ కపూర్, అన్షులా కపూర్. వీరిలో అర్జున్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోగా ఉన్నాడు.మోనాతో బోనీ కపూర్ విడాకులు తీసుకున్నది శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికే. ఈ విషయాన్ని మోనా భరించింది కానీ.. పిల్లలు మాత్రం భరించలేకపోయారు. ఈ విషయంలో తమ అసహనాన్ని బహిరంగంగానే చాటారు వాళ్లు. ప్రత్యేకించి శ్రీదేవి విషయంలో అర్జున్ కపూర్ యాగ్రసివ్ గానే ఉండేవాడు అనేది బహిరంగమైన విషయం.

ఆమెలో పిన్నిని చూడలేకపోయాడు అర్జున్ కపూర్. తన తల్లికి తన తండ్రిని దూరం చేసిన మహిళగానే చూశాడు శ్రీదేవిని. అయితే తండ్రితో మాత్రం అర్జున్ సఖ్యత కొనసాగించింది. కొడుకుతో తేవర్ సినిమాను తీసి ఆనందపడ్డాడు బోనీ కపూర్. ఆ విధంగా తండ్రీ కొడుకుల బంధం కొనసాగినా… శ్రీదేవికి మాత్రం చాలా దూరంగానే ఉంటూ వచ్చాడు అర్జున్ కపూర్.శ్రీదేవి పిల్లలు జాన్వీ, ఖుషీలతో కూడా అర్జున్ కపూర్ సఖ్యతతో మెలగిన దాఖలాలు లేవు. చిన్నాన్న కూతురు సోనమ్ కపూర్ తో చాలా క్లోజ్ గా కనిపించే అర్జున్.. జాన్వీ, ఖుషీలకు మాత్రం దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ రోజుల్లో బాలీవుడ్ లో విడాకులు తీసుకున్న భార్యభర్తలే మళ్లీ కలిసి పార్టీలు చేసుకొంటూ ఉన్నా.. అర్జున్ కపూర్ మాత్రం సగటు మనిషిగానే స్పందిస్తూ వచ్చాడు.

శ్రీదేవితో, ఆమె పిల్లలతో ఏ మాత్రం సాన్నిహిత్యాన్ని ప్రదర్శించలేదు. వారిపై నిరసన భావంతో కూడా మాట్లాడాడు. సవతి తల్లిపై నిరసన భావంతో ఉండే కొడుకులానే వ్యవహరించాడు అర్జున్. కొన్నేళ్ల కిందట తల్లి కూడా మరణించడంతో అర్జున్ కపూర్ మరింత ఒంటరయ్యాడు.ఇప్పుడు అర్జున్ మాత్రమే కాదు… బోనీ కపూర్, శ్రీదేవి పిల్లలు కూడా ఒంటరి వాళ్లే అయ్యారు. అతడికీ తల్లి లేదు, జాన్వీ, ఖుషీలకు కూడా తల్లి లేదు. మరి ఈ పరిస్థితుల నడుమ బోనీ కపూర్ పిల్లలు దగ్గరై, కుటుంబంగా మెలుగుతారేమో చూడాలి. ఆమె బతికి ఉన్న రోజుల్లో సంగతెలా ఉన్నా, శ్రీదేవి అంత్యక్రియల్లో అర్జున్ కపూర్ విషాదభరితంగానే కనిపించాడు.