పూర్తి కావచ్చిన సినిమాకు రూ. 20 కోట్ల సెట్‌ ఏంటో?

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌ దాదాపుగా 80 శాతం పూర్తి అయినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. రాజమౌళితో పాటు పలువురు యూనిట్‌ సభ్యులు కూడా పలు సందర్బాల్లో సినిమా పూర్తి కావచ్చిందన్నారు. లాక్‌ డౌన్‌ రాకుండా ఉంటే ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ దాదాపుగా ముగిసేది. ఈ నెలలో గుమ్మడికాయ కొట్టేవారు. కాని మరో రెండు నెలలు షూటింగ్‌ జరపాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా స్పీడ్‌ గా షూటింగ్‌ జరిగే పరిస్థితి లేదు కనుక ఈ ఏడాది చివరి వరకు షూటింగ్‌ జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన ఈ సమయంలో జక్కన్న రూ. 20 కోట్లతో ఒక సెట్‌ ను వేయించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందంటున్నారు. ఎన్టీఆర్‌ తో హీరోయిన్‌ పాట మరికొన్ని సీన్స్‌ మాత్రమే బ్యాలన్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. అలాంటప్పుడు 20 కోట్ల సెట్‌ ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జక్కన్న సినిమాను భారీగా తెరకెక్కిస్తాడు. కాని ప్రతి పైసాను కూడా చాలా జాగ్రత్తగా వినియోగిస్తాడు అనేది ఆయనతో వర్క్‌ చేసిన వారి మాట. అందుకే ఈ కొద్ది సమయం షూటింగ్‌ కోసం రాజమౌళి అంత భారీ సెట్‌ ను వేయించడం అనేది ఖచ్చితంగా నిజం అయ్యి ఉండక పోవచ్చు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా సినిమాను వచ్చే వేసవికి షిఫ్ట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ వీడియోను విడుదల చేయడంతో పాటు విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు.