ఏ వన్, ఏ టూ.. దేవుడా.. ఇదెక్కడి రాజకీయం.?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏ వన్.. మాజీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఏ టూ.. లెక్కలు అదిరాయ్.! ఇంకెందుకు ఆలస్యం, అరెస్టు చేసి లోపలేసెయ్యండంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నినదించడం.

ఇటీవల వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళితే, అక్కడ ఆయన మీద దాడికి యత్నించారు కొందరు. ఆ దాడికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. అంతా చంద్రబాబేనన్నది వైసీపీ శ్రేణుల ఆరోపణ. రాజకీయ దాడులు.. ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణం. కొన్నాళ్ళ క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు మీద విశాఖలో దాడికి యత్నించారు వైసీపీ మద్దతుదారులు. అప్పట్లో, ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదు. పోలీసు ఉన్నతాధికారులకు న్యాయస్థానం చీవాట్లు పెట్టినా, ఆ కేసులో జరగాల్సిన స్థాయిలో అరెస్టులు జరగలేదని అప్పట్లో టీడీపీ వాపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

కానీ, ఇక్కడ దాడి యత్నం జరిగింది విజయసాయిరెడ్డిపైనా. అందుకే, పోలీసులు అంత సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కొన్నళ్ళ క్రితం నెల్లూరు జిల్లాలో ఓ సీనియర్ జర్నలిస్టుపై అదికార పార్టీ ఎమ్మెల్యే దాడికి యత్నిస్తే.. అప్పట్లో పోలీసులు, ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాల్లెక్కెట్టిన వైనాన్ని ఎలా మర్చిపోగలం.? చంద్రబాబు హయాంలోనూ పోలీసు వ్యవస్థ ఇలాగే వ్యవహరించింది. అధికార పార్టీకి ఒకలా, ప్రతిపక్షాలకు ఇంకోలా చట్టాల్ని అమలు చేస్తూ రావడం ఆంధ్రపదేశ్ పోలీస్‌కి అలవాటైపోయిందన్న విమర్శలు లేకపోలేదు.

పోలీసు అధికారులు మాత్రం, ‘అదంతా దుష్ప్రచారం..’ అని కొట్టి పారేస్తుంటారనుకోండి.. అది వేరే విషయం. ఇంతకీ, విజయసాయిరెడ్డిపై దాడి యత్నం కేసులో చంద్రబాబు అరెస్టవుతారా.? అంటే, అవునని వైసీపీ శ్రేణులు డిసైడ్ చేసేస్తున్నాయి. ఏమో, ఏదైనా జరగొచ్చు.. చంద్రబాబు అరెస్టయితే.. ఆయనకు విపరీతమైన పబ్లిసటీ వచ్చిపడుతుంది. కానీ, అంత సీన్ వుంటుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.