అగ్ర నిర్మాత దిల్ రాజుకు మహ్మద్ యాకూబ్ అలీ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఓ చిన్న సినిమా నచ్చేసి.. దాన్ని తన బేనర్లో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వేరే టైటిల్తో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘వెళ్లిపోమాకే’ అనే టైటిల్ పెట్టింది కూడా రాజే. నాలుగు నెలల కిందటే విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేద్దామని దిల్ రాజే ఆపాడు.
ముందు ఈ నెల 10న విడుదల అనుకున్నారు కానీ.. ఆ రోజు పోటీ ఎక్కువగా ఉండటంతో 17కు వాయిదా వేశారు. నాలుగు రోజుల ముందు వరకు కూడా ఈ సినిమా 17న పక్కా అనే అనుకున్నారు. కానీ అనుకోని పరిణామంతో ఈ చిత్ర విడుదల మళ్లీ వాయిదా పడింది.
మూడు రోజుల కిందట దిల్ రాజు సతీమణి అనిత గుండెపోటుతో హఠాత్తుగా చనిపోవడంతో ‘వెళ్లిపోమాకే’ సినిమా విడుదలను ఆపేశారు. ఈ చిత్రంలో నటీనటులు.. సాంకేతిక నిపుణులు అదరూ కొత్తవాళ్లే. కేవలం దిల్ రాజు పేరు మీదే ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. ఆయన్ని ముందు పెట్టే సినిమాను ఇప్పటిదాకా ప్రమోట్ చేస్తూ వచ్చారు.
విడుదల సమయంలో ఐతే ప్రస్తుతం దిల్ రాజు విషాదంలో ఉన్న నేపథ్యంలో బయటికి వచ్చి సినిమాను ప్రమోట్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం రాజు ఉన్న పరిస్థితుల్లో ఎస్వీసీ టీంకుకూడా విడుదలకు సన్నాహాలు చేయడం ఇబ్బందికరమే. దీంతో సినిమాను మరోసారి వాయిదా వేయడం వల్ల మరీ ఇబ్బందేమీ లేదని భావించి ఈ వారం విడుదలను ఆపేసినట్లు తెలుస్తోంది.