క్యారెక్టర్ ఆర్టిస్ట్ పై మెగా ఫాన్స్ దారుణ ట్రోల్ల్స్!

ఫ్యాన్స్ మధ్య వార్ ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. అయితే వారి మధ్యలోకి ఎవరైనా వచ్చారంటే అయిపోయారే. వారిని ఏ రేంజ్ లో ఆడేసుకుంటూ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. ఫ్యాన్స్ కోల్డ్ వార్ ని భరించలేకే చాలా మంది స్టార్ డైరెక్టర్స్ తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు చేయాలంటే భయపడిపోతున్నారు. ఇక కొంత మంది రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ధైర్యం చేసి భారీ మల్టీస్టారర్ చిత్రాలు చేసినా అందులో హీరోలకు సంబంధించి సమాన ప్రాధాన్యత లేకపోతే మాత్రం వారిని కూడా సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.

అంతే కాకుండా ఇద్దరి ఫ్యాన్స్ మధ్యలోకి ఎవరైనా ఎంటరైతే వారికి బూతు పురాణంతో చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పడు ఇదే తరహా పరిస్థితిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఎదుర్కొంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. భారతీయ చిత్రాల్లోనే దాదాపు 500 కోట్లకు మించిన బడ్జెట్ తో తెరకెక్కిన తొలి చిత్రంగా రికార్డు సొంతం చేసుకున్న ఈ మూవీ ఎట్టకేలకు ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద వరుసగా రికార్డుల్ని తిరగరాస్తోంది.

ఇప్పటికే పలు రికార్డుల్ని తిరగరాసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇదిలా వుంటే ఇందులో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన అద్భుతం అంటే లేదు లేదు మా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన అద్భుతం అని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ విడుదలైన తొలి రోజు నుంచి డిబేట్ వార్ నడుస్తోంది. ఇది తాజాగా బోర్డర్ దాటేసింది.

ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ‘కొమురం భీముడో.. సాంగ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. చాలా వరకు ఫ్యాన్స్ దక్షిణాది.. ఉత్తరాది అనే భేదం లేకుండా దేశ వ్యాప్తంగా వున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ పాటకు కోట్లల్లో స్పూఫ్ వీడియోలు చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు. కొంత మందేమో ఈ సీన్ కు సంబంధించిన వీడియో క్లిప్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అందరిలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కూడా ‘కొమురం భీముడో.. సాంగ్ కి సంబంధించిన ఓ ఫొటోని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ కి ఫైర్ ఎమోజీలని జోడించి లవ్ సింబల్ ని జత చేస్తూ ట్వీట్ చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెగా ఫ్యాన్స్ బ్రహ్మాజీని దారుణంగా ట్రోల్ చేస్తూ మాటలకందని పదాలతో బూతు పురాణం అందుకున్నారు. ‘వీడెవడో నందమూరి కుక్కలా వున్నాడు’ అంటూ దారుణంగా ట్రోల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రతీ దానిపై ప్రతీ ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛ వుందని అదే స్వేచ్ఛ ప్రకారం సదరు నటుడు తన భావాన్ని ప్రకటిస్తూ ఫొటోని షేర్ చేయడానికి స్వాగతించాలే కానీ ఇలా విరుచుకుపడటం ఏమీ బాగాలేదని పలువురు నెటిజన్స్ మెగా ఫ్యాన్స్ పై సెటైర్లు వేస్తున్నారట. మెగా ఫ్యాన్స్ తరహాలో రేపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసినా దాన్ని ఎవరూ హర్షించరు. కాబట్టి బావప్రకటన స్వేచ్ఛను గౌరవించి అభిమానులు సంయమనం పాటిస్తే మంచిదని అప్పడే ఇండస్ట్రీలో అత్యుత్తమ చిత్రాలు వస్తాయని విమర్శకులు అంటున్నారు.