తమిళ సినీ.. టీవీ నటి నందిని భర్త సూసైడ్ వ్యవహారం ఇప్పుడు షాకింగ్గా మారింది. ఆర్థిక సమస్యల కారణంగా మరణించినట్లు చెబుతున్నారు. చెన్నైలోని విరుగంబాక్కమ్ లోని ఒక లాడ్జిలో విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తించారు. వంశం.. కేడి బిల్లా కిలాడి రంగ లాంటి తమిళ సినిమాల్లో.. టీవీ సీరియల్ శరవణన్ మీనాక్షి లోని మైనా పాత్ర ద్వారా పాపులర్ అయిన 30 ఏళ్ల నందిని ఆ మధ్యన కార్తికేయన్ను వివాహమాడారు. ఇదిలా ఉంటే.. తన భర్త నుంచి తాను విడిపోయినట్లుగా నందిని చెబుతోంది.
జిమ్ నడిపే కార్తికేయకు నందినితో వివాహానికి ముందు ఒక పెళ్లి జరిగింది. మొదటి భార్య మరణం అనంతరం అతడు నందిని వివాహామాడారు. కానీ.. ఇరువురి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో వారు విడిపోయినట్లుగా తెలుస్తోంది. కాగా..కార్తికేయ ఆత్మహత్యకు నందిని తండ్రి కారణంగా వార్తలు వచ్చాయి. దీనిని ఆమె తీవ్రంగా ఖండించారు. తనకు.. తన భర్తకు సంబంధం లేదని.. విడిగా ఉంటున్నట్లుగా ఆమె చెబుతోంది. ఉద్యోగాలు ఇస్తామంటూ పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకునేవాడని.. దీని కారణంగా తాను చాలానే సమస్యల్ని ఎదుర్కొన్నట్లుగా నందిని పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేయటాన్ని తాను నిలదీశానని.. ఆ సందర్భంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని చెప్పారు. దీంతో.. తన తల్లిదండ్రులు తనను దూరంగా తీసుకెళ్లినట్లుగా ఆమె చెప్పారు. ఒకప్పటి తన భర్త ఆత్మహత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న ఆమె.. కార్తికేయ చేసిన పనితో తన పరువు బజారున పడినట్లుగా వాపోయింది. తన డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నాడని చెబుతోంది.