‘పుష్ప’ పుకార్లన్నింటికి ఫుల్‌స్టాప్‌

అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు మరో హీరోయిన్‌గా నివేదా థామస్‌ నటించబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అని, ఆమెతో బన్నీకి ప్రేమ నడుస్తుందని, రష్మికతో కంటే సెకండ్‌ హీరోయిన్‌తో రొమాన్స్‌ ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు. అసలు పుష్ప చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ అనే కాన్సెప్ట్‌ లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

సుకుమార్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన ఎక్కువ సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌ లేనే లేదు. అలాగే ఈ సినిమా కూడా కొనసాగుతుందని అంటున్నారు. అయితే అనసూయ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తుందని మాత్రం వార్తలు వస్తున్నాయి. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త తరహాలో కాస్త అటు ఇటుగా అనసూయ పాత్ర ఉంటుందని అంటున్నారు.

రష్మికతోనే బన్నీ ప్రేమ వ్యవహారం ఉంటుందని, మరో హీరోయిన్‌ను లవ్‌ ట్రాక్‌ కోసం పెట్టే ఆలోచన సుకుమార్‌ చేయడం లేదని చిత్ర పీఆర్‌ టీం ప్రకటించింది. ఈ విషయంలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ కూడా పుకార్లే అని తేలిపోయింది. నివేదా థామస్‌ నటించబోతుందనే వార్తలకు ఇకపై అయినా ఫుల్‌ స్టాప్‌ పడుతుందేమో చూడాలి. ఇక ఈ చిత్రం షూటింగ్‌ను లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కేరళలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.