నందమూరి బాలకృష్ణ.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన బోయపాటి శ్రీను.. హీరోగా ఎలాంటి ఇమేజ్ లేని బెల్లంకొండ శ్రీనివాస్తో సినిమా చేయడమేంటి అని అంతా అన్నారు. ఐతే హీరో స్టార్ కాకపోతే ఏమి.. ఇందులో చాలామంది స్టార్లను నటింపజేస్తూ ఈ ప్రాజెక్టుకు కావాల్సినంత క్రేజ్ తీసుకొస్తున్నాడు బోయపాటి. కాకపోతే సమస్య ఏంటంటే.. బెల్లంకొండ బాబును హీరోగా ఎలివేట్ చేస్తాడని అనుకుంటే ఇందులో భారీ తారాగణాన్ని పెట్టేసి అతను హైలైట్ కాకుండా చేస్తాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయిప్పుడు.
బోయపాటి సినిమాలో హీరోహీరోయిన్లు బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్లే కానీ.. మొత్తంగా ఈ చిత్రంలో ఆరుగురు హీరోలు.. ఆరుగురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. బెల్లంకొండ కాకుండా ఇందులో జగపతి బాబు, శరత్ కుమార్, సుమన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ ఒకప్పటి హీరోలు. వీళ్లు కాకుండా ఈ తరం హీరోలు నందు, శశాంక్ కూడా ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ల విషయానికి వస్తే.. ఇందులో రకుల్ కాకుండా ప్రగ్యా జైశ్వాల్ మరో కథానాయిగా నటిస్తోంది. కేథరిన్ థ్రెసా ఐటెం సాంగ్ చేస్తోంది. ‘భీమవరం బుల్లోడు’ సినిమాలో నటించిన ఎస్తేర్కు సైతం ఒక పాత్ర ఇచ్చారు. అలనాటి అందాల తార వాణీ విశ్వనాథ్కు కూడా ఛాన్సిచ్చిన బోయపాటి.. సితారకూ ఒక రోల్ కేటాయించాడు.
మరి ఇంతమంది తారల మధ్య బెల్లంకొండ శ్రీనివాస్కు ఏమాత్రం పాత్ర ఉంటుందో.. అతను ఎంత మాత్రం హైలైట్ అవుతాడో చూడాలి. ఈ తారాగణానికి భారీగా పారితోషకాలు ఇవ్వడం వల్ల బడ్జెట్ కూడా బాగా పెరిగింది. ఈ సినిమాకు నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి పేరు పెడుతున్నా.. డబ్బులన్నీ బెల్లంకొండ ఫ్యామిలీవే అంటున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టుకుంటున్న బెల్లంకొండ ఫ్యామిలీకి ఆశించిన ప్రయోజనం దక్కుతుందో లేదో చూడాలి.