పృథ్వీ ఇలా కెలుక్కుంటున్నాడేంటి?

అనుకోకుండా స్టార్ ఇమేజ్ సంపాదించాడు కమెడియన్ పృథ్వీ. రెండేళ్లుగా టాలీవుడ్లో అతడి హవా నడుస్తోంది. ఈ మధ్యే హీరోగా మారి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే సినిమా కూడా చేశాడు. ప్రస్తుతం చేతిలో రెండంకెల సంఖ్యలో సినిమాలున్నాయి. కెరీర్ ఇలా ఊపుమీదున్నపుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎవరితోనూ సున్నం పెట్టుకోకూడదు. కానీ పృథ్వీ తెలిసో తెలియకో వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. టాలీవుడ్లో పెద్దోళ్లకు కాక తెప్పిస్తున్నాడు. ఆ మధ్య అదే పనిగా బాలయ్యను ఇమిటేట్ చేస్తూ.. ఓ సినిమాలో మరీ హద్దులు దాటిపోయి బాలయ్య డైలాగులు పలకడంతో నందమూరి అభిమానులు ఫీలయ్యారు. ఈ విషయమై బాలయ్య వరకు ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు వార్తలొచ్చాయి.

ఇక తాజాగా ‘ఖైదీ నెంబర్ 150’లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు తీసేయడంపై అతను స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. తనకు తెలియకుండా సన్నివేశాలు తీసేయడంపై అతను కొంచెం ఘాటుగానే స్పందించినట్లు వార్తలొచ్చాయి. దీని మీద కొన్ని రోజుల పాటు అనవసరంగా వివాదం నడించింది. ఇది చిరంజీవి అండ్ కోకు తలనొప్పిగా మారింది. ఇప్పుడిక పృథ్వీ తనకు సంబంధం లేని ఒక వివాదంలో జోక్యం చేసుకుంటున్నాడు. ఓ కోస్తా జిల్లాలో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన పృథ్వీ.. నారాయణమూర్తి సినిమా ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’కు థియేటర్లు దక్కకపోవడంపై స్పందించాడు. ఇది తనకు చాలా బాధ కలిగించిందని చెప్పాడు. ఇలాంటి పరిస్థితి చిన్న సినిమాలకు రాకూడదన్నాడు.

పృథ్వీ మామూలుగానే స్పందించినప్పటికీ.. ఈ వ్యాఖ్యలు చిరు, బాలయ్యలను పరోక్షంగా ఇబ్బంది పెట్టేవే. వాళ్ల సినిమాలకు థియేటర్లన్నీ తీసుకోవడం వల్లే నారాయణమూర్తి సినిమాకు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నది వాస్తవం. ఈ వ్యవహారమై మీడియా వాళ్లు ప్రశ్నలు సంధించినా నో కామెంట్ అనేసి వెళ్లిపోవచ్చు. కానీ పృథ్వీ దీనిపై స్పందించడం ద్వారా అనవసరంగా కెలుక్కున్నట్లే. ఆల్రెడీ బాలయ్య.. చిరు అభిమానుల నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొన్న పృథ్వీ.. ఇప్పుడీ కొత్త వివాదంలో ఎందుకు జోక్యం చేసుకున్నాడో? ప్రస్తుతం జోరుమీదున్నాడు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఎన్ని చేసినా చెల్లిపోతుంది కానీ.. ఆ జోరు తగ్గాకే వీటి ఎఫెక్ట్ కనిపిస్తుంది. అది దృష్టిలో ఉంచుకుని పృథ్వీ కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే బెటర్.