జవాన్‌తో ఆడుకుంటోన్న దిల్‌ రాజు

సెప్టెంబర్‌ 1న విడుదలకి సిద్ధమవుతోన్న దశలో ‘జవాన్‌’ చిత్రానికి అడ్డు తగిలాడట దిల్‌ రాజు. ఈ చిత్రానికి సమర్పకుడి బాధ్యతలు తీసుకున్న దిల్‌ రాజు ఇప్పుడే విడుదల చేయవద్దంటూ నిర్మాతకి తేల్చి చెప్పాడట. బివిఎస్‌ రవి డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం తనకి కొత్త ఇమేజ్‌ తెచ్చి పెడుతుందని సాయి ధరమ్‌ తేజ్‌ ఆశించాడు. దిల్‌ రాజు తనకి బాగా కలిసి రావడంతో దీనికి సమర్పకుని బాధ్యతలు తీసుకోమని తనే రిక్వెస్ట్‌ చేసాడు.

ఫైనల్‌ ప్రోడక్ట్‌ తనకి నచ్చితేనే విడుదల చేయాలని కండిషన్‌ పెట్టాడట. అలాగే రిలీజ్‌ డేట్‌ కూడా తనే ఫిక్స్‌ చేస్తానని అన్నాడట. అలా దిల్‌ రాజుకి కమిట్‌ అయిన జవాన్‌ బృందం ఇప్పుడు చిక్కుకుపోయిందట. మిగిలివున్న ఒక్క పాట చిత్రీకరణ చేయవద్దని అడ్డు పడుతూ, జవాన్‌ని దసరా బరి నుంచి తప్పించేసాడు దిల్‌ రాజు.

అక్టోబర్‌లో కూడా విడుదలకి తగిన సమయం కాదంటూ ప్రస్తుతానికి నవంబర్‌కి గెంటాడు. నవంబర్‌ సినిమాలకి అనుకూలమైన సమయం కాదని జవాన్‌ టీమ్‌ కంగారు పడుతున్నా కానీ దిల్‌ రాజు మాత్రం దీనికి ఇంకా మార్పులు చేయాలని, ఇప్పుడు విడుదల చేయడం సబబు కాదని చెప్పి వాయిదా వేయించాడట.

ఆ మార్పులేవో తేల్చేస్తే షూటింగ్‌ చేసుకుని దసరాకి అయినా రెడీ కావాలని జవాన్‌ టీమ్‌ ఆశ పడుతోంది కానీ దసరాకి విడుదలయ్యే సినిమాల నైజాం హక్కులన్నీ తనవే కావడంతో దసరాకి మాత్రం ఇది రాకూడదని తెగేసి చెప్పాడట. సాయి ధరమ్‌తేజ్‌తో పాటు బివిఎస్‌ రవికి కూడా కీలకమైన ఈ చిత్రం ఎప్పటికి బయటకి వస్తుందో?