త్రివిక్రమ్‌ బ్రేక్‌ ఇస్తే, ఎన్టీఆర్‌ మలుపు తిప్పాడు

హరితేజ… కొన్ని వారాల క్రితం వరకు ఈమె ఎవరనేది చాలా మందికి తెలీదు. ‘అ ఆ’ చూసిన వారికి అందులో సమంత వెంట నితిన్‌ ఊరికి వెళ్లే మెయిడ్‌ పాత్ర చేసిందనే సంగతి తెలుసు. నటిగా ‘అ ఆ’తో హరితేజకి త్రివిక్రమ్‌ బ్రేక్‌ ఇస్తే, ఆమెని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ చేసింది మాత్రం ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తోన్న ‘బిగ్‌ బాస్‌’ షోనే. ఫస్ట్‌ సీజన్‌కి ఎంచుకున్నవారిలో ఆరంభంలో ఎవరూ జనానికి అంత నచ్చలేదు.

సంపూర్ణేష్‌, ధన్‌రాజ్‌, ముమైత్‌ఖాన్‌, అర్చనలాంటి వాళ్లు ఈ షోకి హైలైట్‌ అవుతారని అనుకున్నారు. అయితే సంపూర్ణేష్‌ ఆదిలోనే చేతులెత్తేసి పారిపోయాడు. ధన్‌రాజ్‌ కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు వారాలుగా జరుగుతోన్న ఈ షోలో మిగిలి వున్న కంటెస్టెంట్స్‌ అంతా జనాలపై ఎంతో కొంత ముద్ర వేయగలిగారు.

నవదీప్‌లాంటి వాళ్లు షోకి వన్నె తీసుకురాగా, తన ఎనర్జీతో ఈ షోని ఒంటిచేత్తో నడిపించేస్తోంది హరితేజ. ఆరంభంలో అర్చన, కల్పన, ముమైత్‌లాంటి వాళ్ల వెనుక వుండిపోయిన హరితేజ షో మిడిల్‌ స్టేజెస్‌కి చేరుకునే సరికి బాగా ఓపెన్‌ అయింది. ఎప్పుడూ తన అల్లరి, ఆట పాటలతో బిగ్‌బాస్‌కి ఈమే విన్నర్‌ అవుతుందనే భావన కలిగించింది.

కొన్ని టాస్క్‌ల విషయంలో మిగతా వారంతా బేలగా మారిపోతే హరితేజ మాత్రం రెచ్చిపోతోంది. ముఖ్యంగా ఆమె చెప్పిన హరికథ ఈ సీజన్‌కి వన్‌ ఆఫ్‌ ది హైలైట్స్‌గా నిలిచింది. హరికథ తర్వాత హరితేజ గెలుస్తుందనే ఫీలింగ్‌ మిగతా కంటెస్టెంట్స్‌లోను వచ్చేసి వుండొచ్చు. ఇకపై ఆమె డామినేషన్‌ తగ్గించడానికి మిగతా వాళ్లు ఎలాంటి ట్రిక్కులతో వస్తారనేది చూడాలి.