అదరగొట్టేసే దిల్ రాజు కాన్సెప్ట్ అదేనా?

అదరగొట్టేసే దిల్ రాజు కాన్సెప్ట్ అదేనా?

సినిమా ప్రొడ్యూసర్ కి సెలబ్రిటీ హోదా పోయి చాలా కాలమే అయ్యింది. అయితే.. అందుకు భిన్నమైన నిర్మాతగా దిల్ రాజుకు పేరుంది. ఆయన తీసేది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా.. ఆయన పేరే ఒక బ్రాండ్ గా ఫీలయ్యే వారున్నారు. అందుకే.. ఆయన సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో అదో క్రేజ్. అందుకు తగ్గట్లే ఆయన నిర్మించిన తాజా చిత్రం శతమానంభవతి. చిరు.. బాలకృష్ణల్లాంటి హేమాహేమీల సినిమాలు విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వేళ.. కథను నమ్ముకొని రిలీజ్ చేసిన దిల్ రాజుకు.. అభినందనలతో పాటు.. కాసుల వర్షం కురుస్తోంది.

పేరు లేని రచయితకు అవకాశం ఇచ్చి సినిమా తీయించిన దిల్ రాజు.. తన ఛాయిస్ ఎంతమాత్రం తప్పుకాదని.. తన జడ్జిమెంట్ ఎప్పుడూ ఫెయిల్ కాదన్న విషయాన్ని మరోసారి నిరూపించారు. నైజాం.. విశాఖ మినహా.. మిగిలిన ఏరియాలు.. శాటిలైట్ హక్కుల్ని అమ్మేసి.. బ్రాహ్మండమైన లాభాల్ని సొంతం చేసుకున్నారు. ఆయన ఉంచుకున్న ఏరియాల నుంచి అప్పుడే షేర్ కింద రూ.5కోట్ల వరకూ వచ్చేస్తుందని చెబుతున్నారు.

కనీసం మూడు వారాల సినిమాగా టాక్ వినిపిస్తున్న వేళ.. కలెక్షన్ల జోరు మరింత పెంచేందుకు ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా ఇటీవల ప్రకటించారు దిల్ రాజు. తాను ఇప్పటివరకూ చేయనంత భారీగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి.. ఆ వివరాల్ని చెప్పకుండా ఆసక్తిని పెంచేశారు.

ఇంతకీ.. దిల్ రాజు ఏర్పాటు చేస్తున్న సభ స్పెషాలిటీ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఈ కార్యక్రమంలో వందమంది సీనియర్ దంపతులకు సన్మానం చేస్తారని తెలుస్తోంది. అయితే.. ఆ జంటలు ఎవరై ఉంటారు? అన్నది ఇప్పుడు క్వశ్చన్ గా ఉంది. ఏమైనా.. ఫీల్ గుడ్ సినిమాలే కాదు.. అందరి మనసుల్ని దోచుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తానన్న విషయాన్ని తాజా ప్రోగ్రాంతో దిల్ రాజు చెప్పేస్తారేమో.