గోపీచంద్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఆక్సిజన్ చిత్రం ఇప్పటికే చాలా కాలంగా నిర్మాణంలో వుంది. రత్నం ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో వుండడంతో ఈ చిత్రం షూటింగ్ సజావుగా సాగడం లేదు. జ్యోతికృష్ణ ట్రాక్ రికార్డ్ కారణంగా బయ్యర్లు ఈ చిత్రంపై ఆసక్తి చూపించడం లేదు.
మామూలుగా ఒక భారీ బడ్జెట్ సినిమా అనౌన్స్ చేస్తే, బయ్యర్లు వచ్చి అడ్వాన్సులు ఇచ్చి వెళతారు. అలా నిర్మాతకి షూటింగ్ పూర్తి చేసే వీలు చిక్కుతుంది. కానీ బయ్యర్లు అడ్వాన్సులు ఇవ్వకపోతే మొత్తం ఫైనాన్స్ల మీద నడిపించడం పెను భారమవుతుంది. ఆక్సిజన్ చిత్రానికి బయ్యర్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గోపీచంద్కి ఇటీవలి కాలంలో చెప్పుకోతగ్గ హిట్ లేకపోవడం కూడా ఈ చిత్రం సమస్యలని రెట్టింపు చేస్తోంది. వెనుక పవన్కళ్యాణ్ సినిమా వుందని నమ్మబుచ్చినా కానీ బయ్యర్లు ఆ ఎత్తుకి పడినట్టు లేరు. ఆక్సిజన్ అయిపోయిన తర్వాత నిజంగా పవన్తో సినిమా తీసినప్పుడు చూద్దాంలెమ్మని అనుకుంటున్నారు. వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకున్న సమయానికి వెలుగు చూడడం అనుమానమేనని అంటున్నారు.