మరో భారత క్రికెటర్ సోషల్ మీడియాలో మత ఛాందసవాదుల దాడికి గురయ్యాడు. టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన భార్య ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది. తన భార్యతో కలిసి కార్లో ప్రయాణిస్తున్న ఇర్ఫాన్.. బురఖా ధరించిన అతడి భార్య ముఖాన్ని చేతులతో కప్పి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఎవరేమనుకున్నా సరే.. తనకు ప్రయాణం చేయడం ఇష్టమని వ్యాఖ్య జోడించాడు. ఈ ఫొటోపై మత ఛాందసవాదులు విరుచుకుపడ్డారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం భార్య ఫొటోను ఇలా బయటపెట్టడం తప్పంటూ అతణ్ని తిట్టి పోశారు.
భార్య ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి సిగ్గు లేదా అని కొందరు.. ముస్లిం మహిళలు నెయిల్ పాలిష్ వేసుకోవడం తప్పని ఇంకొందరు (ఇర్ఫాన్ భార్య వేళ్లకు నెయిల్ పాలిష్ ఉంది).. ఇంకా రకరకాల కామెంట్లతో ఇర్ఫాన్ మీద అటాక్ చేశారు. ఇంతకుముందు టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి తన భార్య కొంచెం మోడర్న్ డ్రెస్ లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది. ఐతే షమి అప్పుడు గట్టిగా ఎదురుదాడి చేయడంతో అవతలి వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. ఇర్ఫాన్ మాత్రం సైలెంటుగా ఉండిపోయాడు. ఇర్ఫాన్ పెళ్లయిన కొత్తలో తన భార్య బురఖాతో ముఖం కప్పి ఉండగా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో లౌకిక వాదుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తన వర్గం వారి నుంచే అతను విమర్శలెదుర్కొన్నాడు.