అటు జగన్, ఇటు చంద్రబాబు ఇరకాటంలో పడ్డట్టేనా?

లాక్ డౌన్-4 మార్గదర్శకాలను ప్రకటించడానికి తెలంగాణ సీఎం మీడియాతో మాట్లాడటానికి వస్తున్నారనగానే.. పోతిరెడ్డిపాడు వ్యవహారంపై ఏం మాట్లాడతారన్నదానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ వివాదంపై ఎక్కువ స్పందించనంటూనే చాలా విషయాలు మాట్లాడారు. పనిలో పనిగా తెలివిగా చంద్రబాబును ఇందులోకి లాగారు. పాలమూరు ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మీవి మీరు కట్టుకోండి, మావి మేం కట్టుకుంటాం అని చెప్పి లేచి వెళ్లిపోయారని కేసీఆర్ వెల్లడించారు. అంటే, ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో బాబు అంగీకరించిన తర్వాత ఇంకా వీటిపై పంచాయతీ ఏమిటి అన్నదే కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోంది. తద్వారా బాబును ఇరకాటంలో పెట్టినట్టయింది.

చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్బంగా ఈ అంశంపై స్పందించారు. ఇద్దరం కలిసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సినిమా డైలాగులు పలికిన జగన్.. ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చడానికి ఉత్తుత్తి జీవోలు ఇచ్చి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాబును ఇరకాటంలోకి నెట్టాయి. మరోవైపు కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టు అంటూ గోదావరి బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో హాజరైన జగన్ కు.. అప్పుడు అది అక్రమం అనిపించలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ తెలివిగా జగన్ ను ఇరికించేందుకే ఆయన్ను ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచారని, జగన్ వెళ్లకపోవడమే మేలని అప్పట్లో కొందమంది అభిప్రాయపడ్డారు. కానీ కేసీఆర్ తో ఉన్న సంబంధాల దృష్ట్యా జగన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవారికి హాజరయ్యారు. ఇప్పుడు తాను వెళ్లనంత మాత్రాన ప్రాజెక్టు ఆగిపోదని, గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైందని జగన్ అప్పట్లో వ్యాఖ్యానించారు.