బన్నీ ఇక వాళ్ల వెనకపడడన్నమాట..

అల్లు అర్జున్ కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ పూర్తి కావస్తోంది. ఈ నెలలోనే గుమ్మడికాయ కొట్టేసే అవకాశముంది. వచ్చే నెలలోనే బన్నీ నెక్స్ట్ మూవీ ప్రారంభోత్సవం జరుపుకోనుంది. రైటర్ టర్నింగ్ డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘నా పేరు సూర్య’ (క్యాప్షన్: నా ఇల్లు ఇండియా) అనే టైటిల్ అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నటీనటులు.. టెక్నీషియన్లను ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు వక్కంతం వంశీ. ఇందులో బన్నీ సరసన ఓ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కథానాయికగా నటించనుందని సమాచారం. ఆ హీరోయిన్ పేరు.. కియారా అద్వాని.

గత ఏడాది సూపర్ హిట్టయిన బయోపిక్ ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’లో కీలక పాత్ర పోషించింది కియారా. ధోని భార్య సాక్షి పాత్రను చేసింది ఆమె. చిన్న పాత్రే అయినా బాగా చేసిందని ఆమెకు పేరొచ్చింది. అందం.. అభినయం రెండూ ఉన్న ఈ అమ్మాయిని బన్నీ హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట. ‘రామలక్ష్మి సినీ క్రియేషన్స్’ బేనర్ మీద లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ మధ్య స్టార్ హీరోలకు తెలుగులో హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతోంది. సమంత.. కాజల్.. తమన్నాలలో మునుపటి ఊపు లేదు. వాళ్లందరితోనూ స్టార్ హీరోలందరూ ఒకటికి మించి సినిమాలు చేసేశారు.

శ్రుతి హాసన్, రకుల్ ప్రీత్‌ కూడా అయిపోయారు. ఈ ఐదుగురితో సినిమాలు చేయాలంటే డేట్ల సమస్య ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే బన్నీ వీళ్లెవ్వరి కోసం వెయిట్ చేయకుండా కొత్త ముంబయి భామల మీద దృష్టిపెడుతున్నట్లున్నాడు. ఇంతకుముందు తెలుగులో రెండు సినిమాలు చేసి వెళ్లిపోయిన పూజా హెగ్డేను ‘డీజే’ కోసం పట్టుకొచ్చిన బన్నీ ఇప్పుడు కియారా అద్వానీ మీద దృష్టిపెట్టాడు.