మెగా హీరో ‘శతమానం భవతి’ దిల్‌రాజు లాక్కున్నాడు!

‘శతమానం భవతి’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న దిల్‌ రాజుకి ఈ కథని పరిచయం చేసింది సాయి ధరమ్‌ తేజ్‌ అట. ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రానికి రచనా సహకారం అందించిన వేగేశ్న సతీష్‌ అప్పట్లో ఈ కథని సాయిధరమ్‌కి చెప్పాడట. అతనికి కథ బాగా నచ్చడంతో, ఇలాంటి కథ దిల్‌ రాజుకి కనక్ట్‌ అవుతుందని భావించి అక్కడికి తీసుకుపోయాడట. కథ విన్న రాజు వెంటనే సతీష్‌కి పదకొండు వేల నూట పదకొండు రూపాయల అడ్వాన్స్‌ ఇచ్చి కమిట్‌ అయ్యాడట.

సాయిధరమ్‌ తేజ్‌తోనే ఈ సినిమా తీస్తానన్న దిల్‌ రాజు ముందుగా ‘సుప్రీమ్‌’ తీసాడు. ‘సుబ్రమణ్యం’, ‘సుప్రీమ్‌’ చిత్రాలకి తేజ్‌కి ఎక్కువ పారితోషికం ఇవ్వని దిల్‌ రాజు ‘శతమానం భవతి’కి కూడా తక్కువ పారితోషికమే ఇస్తానంటూ పట్టుబట్టాడట. అయితే తేజ్‌కి వేరే కమిట్‌మెంట్లు ఉండడంతో, తన మార్కెట్‌ కూడా పెరగడంతో తక్కువకి నో అన్నాడట. దాంతో ఆ కథని రాజ్‌ తరుణ్‌తో తీద్దామనుకున్న దిల్‌ రాజు అటునుంచి శర్వానంద్‌కి షిఫ్టయ్యాడు.

అలా అసలు కథని దిల్‌ రాజు దగ్గరకి తీసుకొచ్చిన సాయిధరమ్‌తేజ్‌ ఈ బ్లాక్‌బస్టర్‌ని మిస్‌ అయిపోయాడు. విచిత్రం ఏమిటంటే ఈ కథని తన దగ్గరకి తీసుకొచ్చింది తేజ్‌ అని రాజు కానీ, తనని ముందుగా ఎంకరేజ్‌ చేసింది సాయిధరమ్‌ తేజ్‌ అని దర్శకుడు సతీష్‌ కానీ ఎక్కడా చెప్పడం లేదు.