నామినేషన్ వేసేవరకూ టెన్షనే

నామినేషన్లు వేయడానికి తుది గడువు దగ్గరకొచ్చేసింది. అభ్యర్థులెవరో మాత్రం తెలియడం లేదు. చిన్నబాబు లోకేశ్ పేరొక్కటి మాత్రం ఖరారైంది. మిగతావాళ్ల సంగతి చివరి నిమిషం వరకు తేల్చడం లేదు. దీంతో నామినేషన్ కు కావాల్సిన సరంజామా అంతా రెడీ చేసుకుని ఎమ్మెల్సీ టిక్కెటు కోరుకుంటున్న ఆశావహులంతా రెడీగా ఉన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఎవరి పేరు చెబితే వారు వెళ్లి నామినేషన్ వేసేయాలని సిద్ధంగా ఉన్నారు. అయితే.. చంద్రబాబు నుంచి మాత్రం ఇంతవరకు దీనిపై క్లారిటీయే లేదు.

నిజానికి ఆదివారం రాత్రి సరికి  అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరిగినా ఇంతవరకు దీనిపై ఏమీ ముందుకు కదలలేదు.  ఎమ్మెల్యేల కోటా, గవర్నర్ నామినేటెడ్ ద్వారా తెలుగుదేశం పార్టీకి 7 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి.  గట్టిగా ప్రయత్నిస్తే వైసీపీకి దక్కవలసిన మరో ఎమ్మెల్యే కోటా కూడా సాధించే అవకాశం ఉంది.

సొంత సామాజికవర్గం నుంచి..

చంద్రబాబు సొంత సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ టిక్కెట్లు ఆశిస్తున్న వారు ఎక్కుమంది ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముళ్లపూడి రేణుక, చిత్తూరు జిల్లా నుంచి దొరబాబు, అనంతపురం నుంచి సుబ్రమణ్యం ప్రయత్నిస్తున్నారు. ఈ సామాజిక వర్గం నుంచి లోకేష్‌కు ఇప్పటికే  టికెట్ ఖరారవడంతో ఇంకా ఎంతమందికి ఇస్తారన్నది తెలియాల్సి ఉంది. తాజాగా ప్రకాశం జిల్లా సీనియర్ నేత, తనకు ఒకప్పటి మిత్రుడైన కరణం బలరామ్‌ను ప్రత్యేకించి పిలిపించుకున్న బాబు, ఎమ్మెల్సీ సీటు ఇస్తానని, జిల్లాలో పార్టీని పటిష్ఠం చేసే బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. గత మూడునెలల నుంచి ఎడముఖం, పెడముఖం గా ఉంటున్న చంద్రబాబు – కరణం ఇటీవలే తొలిసారి మాట్లాడుకున్నారని, మంత్రి శిద్దా రాఘవరావు రాయబారం నడిపి కరణంను వెంటబెట్టుకుని బాబు వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ బలరామ్‌కు ఇస్తే కమ్మ వర్గంలోని ఇక మిగిలిన వారికి అవకాశం దక్కకపోవచ్చు.

బీసీల నుంచి శ్రీకాళం జిల్లా తూర్పుకాపు వర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడుకు సీటు దక్కవచ్చంటున్నారు. ఇక దళిత సామాజిక వర్గంలో కూడా పోటీ పెరుగుతోంది. గత ఎన్నికల్లో సాంకేతిక సమస్యలొచ్చి అవకాశం కోల్పోయిన మాల వర్గానికి చెందిన జూపూడి ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూ పదవీ విరమణ చేయనున్న ప్రతిభాభారతి కూడా రెన్యువల్ కోరుతున్నారు. ఆమెకు ఇస్తే జూపూడికి ఛాన్సు ఉండకపోవచ్చు.  ప్రస్తుతం జూపూడి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. వచ్చే మంత్రివర్గ విస్తరణలో మాదిగ వర్గానికి చెందిన మంత్రి రావెల కిశోర్‌బాబును తొలగించడం ఖాయం కావడంతో, ప్రత్యామ్నాయంగా ఆ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు అవకాశం దక్కవచ్చంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పామర్రు నుంచి పోటీచేసే అవకాశం లేనందున ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వవచ్చంటున్నారు. అదే వర్గానికి చెందిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటికే రాయపాటి వర్గానికి ఎక్కువ అవకాశాలివ్వడంపై జిల్లాలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పుష్పరాజ్‌కు ప్రతిసారి అన్యాయం జరుగుతున్నందున ఈసారి ఆయనకు తప్పకుండా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారంటున్నారు.

ఇక రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పనిచేసిన వారందరికీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చిన చంద్రబాబు మిగిలిపోయిన బీసీ నేత రవియాదవ్, టీడీఎల్పీలో వేతనం కూడా తీసుకోకుండా ప్రతిపక్షం నుంచి పనిచేస్తున్న కమ్మ వర్గానికి చెందిన కోనేరు సురేష్‌బాబులో ఒకరికి న్యాయం చేయాలంటున్నారు. ఒకవేళ సురేష్‌బాబుకు ఎమ్మెల్సీ అవకాశం దక్కకపోతే ఏపి మీడియా కమిటీ కన్వీనర్ పదవి ఇవ్వవచ్చంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నోరు విప్పితే కానీ అసలు సంగతి తెలియదు.