నారా రోహిత్ ఆ సినిమాను వదిలేశాడా?

నారా రోహిత్ ఏమేం సినిమాల్లో నటిస్తున్నాడో చెప్పమంటే కన్ఫ్యూజ్ అయిపోయే పరిస్థితి నెలకొంది గత ఏడాది. 2015 వరకు ఓ మోస్తరు వేగంతో సినిమాలు చేస్తూ వచ్చిన రోహిత్.. ఆ ఏడాది చివరికి వచ్చేసరికి వరుసబెట్టి సినిమాలు లైన్లో పెట్టాడు. ఏకంగా ఆ సినిమాల లెక్క తొమ్మిదికి పెరిగిపోయింది. వాటిలో ఏ సినిమా ఏ దశలో ఉందో తెలియని పరిస్థితి నెలకొంది ఒక టైంలో.

చాన్నాళ్ల పాటు వాయిదా పడ్డ ‘శంకర’ గత ఏడాది రిలీజైపోయింది కానీ.. రోహిత్ చేసిన మరో సినిమాకు మాత్రం మోక్షం కలగలేదు. కార్తికేయ ప్రసాద్ అనే యువ దర్శకుడితో ‘పండగలా వచ్చాడు’ అనే సినిమాను రోహిత్ మొదలుపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. పోయినేడాది సంక్రాంతికి ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రోహిత్ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు ఆ పోస్టర్లో.

కానీ ఆ తర్వాత ఆ సినిమా గురించి అప్ డేట్ లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను పూర్తి చేసి.. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెబుతూ.. ‘పండగలా వచ్చాడు’ పేరెత్తలేదు. దాదాపు ఏడాదిగా ఈ సినిమా గురించి అప్ డేట్ లేని నేపథ్యంలో సినిమాను మధ్యలోనే వదిలేశారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ప్రస్తుతం రోహిత్ చేస్తున్న సినిమాల్లో ‘కథలో రాజకుమారి’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘సావిత్రి’ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో ‘భీముడు’ త్వరలోనే మొదలవుతుంది.